న్యూఢిల్లీ : ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ముస్లిం విద్యార్ధి సమాఖ్య మహిళా విభాగం హరితను రద్దు చేయడంపై బీజేపీ స్పందించింది. ఈ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఖరి ఏంటో వెల్లడించాలని కాషాయ పార్టీ డిమాండ్ చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘనతోనే మహిళా కమిటీని రద్దు చేసినట్టు ముస్లిం లీగ్ తెలిపింది. ట్రిపుల్ తలాక్ను వ్యతిరేకించిన ముస్లిం లీగ్ తాజాగా మహిళా కమిటీని రద్దు చేసి మహిళల వ్యతిరేక వైఖరిని బట్టబయలు చేసిందని కేంద్ర మంత్రి వీ. మురళీధరన్ అన్నారు.
ముస్లిం లీగ్ మద్దతుతో వయనాద్లో గెలిచిన రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లిం లీగ్ మహిళల గొంతుకను అణిచివేస్తోందని మహిళలను విస్మరిస్తోందని కేంద్ర మంత్రి దుయ్యబట్టారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎందుకు మౌనం దాల్చారని నిలదీశారు. కాంగ్రెస్ భాగస్వామ్య పక్షం ముస్లిం లీగ్ మహిళా హక్కులు, వివక్షపై గొంతెత్తినందుకు ఏకంగా తమ మహిళా విభాగాన్నే రద్దు చేయడం గర్హనీయమని అన్నారు. మహిళా సాధికారతకు అద్దం పట్టే మహిళా కమిటీని తొలగించడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.