భగ్పట్, అక్టోబర్ 30: రైతు నేత రాకేశ్ టికాయిత్పై ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల విషయంలో టికాయిత్ రైతులను మోసం చేశాడని, ఆయన రైతుల మధ్య లేకుంటే ఇప్పటికే ఎన్కౌంటర్లో హతమై ఉండేవాడని వ్యాఖ్యానించారు. భాగ్పట్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నంద కిషోర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతుల ఆందోళనల సమయంలో టికాయిత్ చుట్టూ రైతులు లేకుంటే, ఆయన్ను ఎన్కౌంటర్లో చంపేసేవారని అన్నారు.
నూతన వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చి ఉంటే రైతులకు మధ్యవర్తులు, దళారుల బారి నుంచి విముక్తి లభించేదని, కేంద్రంలోని తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ చట్టాలతో రైతుల జీవితాలు మారిపోయేవని చెప్పుకొచ్చారు. ఖలిస్థానీలు, మధ్యవర్తులతో టికాయిత్ కుమ్మక్కయ్యారని, హేయమైన నేరాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. రెండేండ్ల తర్వాత రైతులు ఆయన్ను దేశంలోకి అడుగు కూడా పెట్టనివ్వరని అన్నారు. మన దేశాన్ని మొఘలులు, ఆ తర్వాత బ్రిటీష్ వాళ్లు బానిసగా చేసుకొన్నారని, త్రివర్ణ జెండా స్థానంలో ఖలిస్థాన్ జెండాను ఎగురవేయడం ద్వారా టికాయిత్ కూడా అదే పనిచేశాడంటూ నంద కిషోర్ గుర్జర్ ఆరోపణలు చేశాడు.
ఎమ్మెల్యే నంద కిషోర్ వ్యాఖ్యలపై టికాయిత్ తీవ్రస్థాయిలో స్పందించారు. తాను ఎక్కడ ఖలిస్థాన్ జెండాను ఎగురవేశానో ఆయన చూపించాలని డిమాండ్ చేశారు. ప్రధాని కూడా గురుద్వారాను సందర్శించారన్నారు. గుర్జర్ ఎన్కౌంటర్ వ్యాఖ్యలపై కేంద్రం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాంటి ప్రకటన చేయడానికి గల కారణాలను తెలుసుకొనేందుకు ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. రైతుల ఆందోళనల సమయంలో నంద కిషోర్ గుర్జర్ గందరగోళం సృష్టించారని, ఆయన అనుచరులు పోలీసుల సమక్షంలోనే రైతులపై దాడి చేశారన్న ఆరోపణలు న్నాయి.