న్యూఢిల్లీ, జూలై 26: ఒక పక్క దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాలు ఈ విషయంలో టాప్లో ఉన్నాయి. అయితే వాస్తవాలను మరుగున పెట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు, మంత్రులు అడ్డగోలు విమర్శలకు తెగబడ్డారు. దీనికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బుధవారం రాజ్యసభలో విపక్షాలకు విసిరిన సవాలే ఉదాహరణగా పేర్కొనవచ్చు. మణిపూర్లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై విపక్షాలు సంధించిన ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వలేని మంత్రి రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్చించే ధైర్యం ఎప్పుడు ఉంటుందని విపక్షాలను నిలదీసారు. అయితే చిత్రంగా మంగళవారం నాటి సభలో సాక్షాత్తు బీజేపీ మంత్రి ఇచ్చిన వివరాలు పరిశీలిస్తే మహిళలపై అఘాయిత్యాల్లో బీజీపీ పాలిత రాష్ర్టాలు మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
మొదటి స్థానంలో యూపీ
మహిళలపై జరిగిన లైంగిక దాడి, హత్యా నేరాలలో 2017 నుంచి 2021 మధ్య 218 కేసులతో యూపీ మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంది. దీని తర్వాతి స్థానాల్లో అస్సాం (191), మధ్యప్రదేశ్ (166), మహారాష్ట్ర (133) ఉన్నాయి. ఈ నాలుగు రాష్ర్టాలు కూడా అప్పుడు, ఇప్పుడు కూడా బీజేపీ పాలనలో ఉండటం గమనార్హం.
అఘాయిత్యాల ఊసెత్తని ప్రధాని మోదీ
మహిళల నగ్న ఊరేగింపు ఘటన చోటుచేసుకున్న మణిపూర్లోనూ బీజేపీ అధికారంలో ఉంది. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నప్పుడు ఈ విషయాలు ప్రస్తావించకుండా విపక్షాల పాలనలో ఉన్న రాష్ర్టాలపై విమర్శలు గుప్పించడం గురివింద గింజ సామెతను గుర్తుకు తెస్తున్నది.