లక్నో, మే 30: డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పగా చెప్పుకునే బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో కరెంట్ చార్జీల మోత మోగుతున్నది. సామాన్యుడిని ఆదుకోవాల్సింది పోయి కరెంట్ చార్జీలు ఏకంగా 10 శాతం పెంచేసింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. ఈ పెరిగిన ధరలు జూన్ 1 నుంచే అమల్లోకి వస్తాయని యూపీపీసీఎల్ తెలిపింది. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడనున్నది. అసలే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులు విలవిల్లాడిపోతుంటే యోగి సర్కార్ మరో షాక్ ఇచ్చింది.
పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ల మీద భారం పడుతోందని.. దాన్ని ప్రజలపై మోపుతున్నామని బహిరంగంగానే యోగి ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరెంట్ కోతలు, సరఫరాలో అంతరాయాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో చార్జీలు పెంచడం ఏంటని యూపీ ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి.