ఇటీవల కురిసిన వడగండ్ల వానతో తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. దీంతో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన సీఎం కేసీఆర్.. బాధిత రైతులను పరామర్శించడమే కాకుండా అక్కడికక్కడే ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఇటీవల వడగండ్ల వానలు బీభత్సం సృష్టించాయి. వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. అకాల వర్షాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ గత పది రోజులుగా అన్నదాతలు ప్రభుత్వానికి మొర పెట్టుకొంటున్నారు. అయినప్పటికీ, సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్పందించట్లేదు. ఇదీ బీజేపీ ట్రబుల్ ఇంజిన్ సర్కారు తీరు.
(స్సెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): యూపీలోని బుందేల్ఖండ్, పరిసర ప్రాంతాల్లో పది రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానలకు వేలాది ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. చేతికొచ్చిన మామిడి, ఆలుగడ్డ, ఆవాలు, కంది, గోధుమ, బఠానీ, వరి పంటలు నీటిపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పరిహారం ఇస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన అంతా అబద్ధమని, నిబంధనల పేరిట అధికారులు కొర్రీలు పెడుతున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. ఇప్పటివరకూ ఒక్క పైసా కూడా పరిహారంగా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోడ్లమీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.
20 జిల్లాల్లో పంట నష్టం
వడగండ్ల వాన కారణంగా ఈ ఏడాది 10-15 శాతం గోధుమ ఉత్పత్తిపై ప్రభావం పడొచ్చని లక్నో యూనివర్సిటీ ప్రొఫెసర్ సధీర్ పన్వార్ అంచనా వేశారు. బుందేల్ఖండ్ ప్రాంతంలో 92% మంది చిన్న, సన్నకారు రైతులేనని, తాజా వడగండ్లతో వాళ్లకు తీరని నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ నిపుణులు ప్రేమ్ సింగ్ పేర్కొన్నారు. యూపీలో ఏటా 45 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుందని, ఈ ఏడాది దిగుబడి తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవలి వడగండ్లతో 20 జిల్లాల్లో పంటనష్టం జరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే, కేవలం ఆరు జిల్లాల్లోనే ప్రభావం ఉన్నదని అధికారులు చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం 33 శాతం పంట నష్టం జరిగిన వారికి పరిహారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. పూర్తిగా నష్టం వాటిల్లిన వారికి కూడా ఒక్క పైసా ఇవ్వలేదని అన్నదాతలు మండిపడుతున్నారు. అకాల వర్షాలతో 15-45 శాతం యాసంగి పంట నీటి పాలైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
చావే దిక్కు
బుందేల్ఖండ్ ప్రాంతంలో సాధారణంగానే రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా సర్కారు సాయపడకుంటే, ఇక మాకు చావే దిక్కు. పీఎం-కిసాన్, కిసాన్ క్రెడిట్ కార్డు వంటి స్కీమ్లకు బడ్జెట్లో నిధులు తగ్గించి రైతులకు కేంద్రం తీరని అన్యాయం చేసింది.
– నాథినీ కుమార్, లలిత్పూర్, యూపీ