Ayodhya | లక్నో : ఈ నెల 22న రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో అయోధ్యలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. అయోధ్యలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. 12 వేల మంది పోలీసులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భద్రత పర్యవేక్షిస్తున్నారు. అయోధ్యలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు భద్రతను కట్టుదిట్టం చేశారు.
సైబర్ నేరగాళ్ల ముప్పును ఎదుర్కొనేందుకు హై లెవల్ సైబర్ ఎక్స్పర్ట్ టీమ్ను కేంద్ర హోంశాఖ అయోధ్యకు పంపించింది. ఇక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్ను కూడా అయోధ్యలో ఏర్పాటు చేశారు. బెదిరింపులను క్షుణ్ణంగా పరిశీలించి, చర్యలు తీసుకోనుంది సైబర్ ఎక్స్పర్ట్ టీమ్. అనుమానాస్పద చర్యలను గుర్తించేందుకు తొలిసారిగా సెక్యూరిటీ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్ సిస్టమ్ను ఉపయోగించుకుంటున్నాయి.
అయోధ్య సిటీ వ్యాప్తంగా 10 వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో 400 కెమెరాలు రామమందిరం పరిసరాలతో పాటు ఎల్లో జోన్లో ఏర్పాటు చేశారు. ఈ ఎల్లో జోన్లో మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నామని ఉత్తరప్రదేశ్ లా అండ్ ఆర్డర్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. నేరస్థులను గుర్తించడానికి, సరిపోల్చడానికి యూపీ క్రిమినల్ డేటాబేస్ను పోర్టల్స్లో అప్లోడ్ చేస్తున్నారు.