సుల్తాన్పూర్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి (Rahul Gandhi) కోర్టు సమన్లు జారీచేసింది. డిసెంబర్ 16న తమ ఎదుట హాజరుకావాలంటూ ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి యోగేశ్ యాదవ్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 2018, ఆగస్టు 4న కర్ణాటక ఎన్నికల సందర్భంగా బెంగళూరులో (Bengaluru) నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అప్పటి బీజేపీ అధ్యక్షుడైన అమిత్ షాను (Amit Shah) హంతకుడిగా అభివర్ణించారు. అయితే ఈ వ్యాఖ్యలు షా గౌరవానికి భంగం కలిగించేవిలా ఉన్నాయంటూ సుల్తాన్పూర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు విజయ్ మిశ్రా (Vijay Mishra) అదే ఏడాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో గత ఐదేండ్లపాటు విచారణ కొనసాగించిన కోర్టు.. వచ్చే నెల 16న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
కాగా, 33 ఏండ్లుగా బీజేపీ కార్యకర్తగా తాను పనిచేస్తున్నానని, రాహుల్ వ్యాఖ్యలు తనను బాధించాయని విజయ్ మిశ్రా చెప్పారు. ఈ కేసు రుజువైతే రాహుల్కు గరిష్ఠంగా రెండేండ్లపాటు జైలుశిక్ష పడుతుందని తెలిపారు. డిసెంబర్ 16 ఆయన కోర్టుకు వచ్చి బెయిల్ తీసుకోవచ్చని, హాజరుకాకపోతే తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.