బీజేపీ మోడల్ రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి ర్యాంకు 16
తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ ఫస్ట్.. యూపీ 19
కేంద్ర గణాంకాల శాఖ నివేదిక స్పష్టీకరణ
హైదరాబాద్, మార్చి 16 : డబుల్ ఇంజిన్ పాలన అంటూ బీజేపీ గొప్పగా చెప్పుకొనే ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి ఎంత అధ్వాన్నంగా ఉన్నదో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన తాజా నివేదిక మరోసారి బహిర్గతం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం జీఎస్డీపీ ర్యాంకుల్లో యూపీ 16వ స్థానంలో నిలిచింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో ఆ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.71,471 మాత్రమే. తలసరి ఆదాయ ర్యాంకుల్లో యూపీ అట్టడుగున 19వ స్థానంలో నిలిచింది. 2020-21లో యూపీ తలసరి ఆదాయం రూ.65,338 మాత్రమే. ఈ డబుల్ ఇంజిన్ గ్రోత్ రాష్ట్రం తెలంగాణకు ఏ అంశంలోనూ కనీసం పోటీ పడే పరిస్థితిలో లేదని నివేదికలోని గణాంకాలు చూస్తే అర్థమవుతున్నది. తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని నివేదిక స్పష్టంచేసింది. స్థిర ధరల వద్ద 2020-21లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,46,278గా ఉన్నది. 2021-22 నాటికి రూ.1,62,142కు పెరిగింది. ఏడాదిలో తలసరి ఆదాయ వృద్ధిరేటు 10.8 శాతంగా నమోదైంది. ఇది దేశంలోనే అత్యధికమని నివేదిక వెల్లడించింది. 10.7 శాతం వృద్ధితో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో, 10.5 వృద్ధి రేటుతో త్రిపుర మూడో స్థానంలో ఉన్నాయి.