బలంగా రైతు ఉద్యమం ఎఫెక్ట్
యోగి పాలనలో దళితులపై దాడులు
ఎస్పీ-ఆరెల్డీ వైపు చూస్తున్న జాట్లు
బీజేపీ పట్టు నిలిచేనా!
2017లో 58 సీట్లకు 53 కైవసం
ఇప్పుడు అఖిలేశ్కు పెరుగుతున్న ఆదరణ
న్యూఢిల్లీ, జనవరి 10: మతపరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో ఉన్న 58 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 10న ఓటింగ్ జరగనున్నది. 2013 అల్లర్లకు కేంద్రమైన ముజఫర్నగర్ ఈ ప్రాంతంలో భాగమే. అల్లర్లకు ముందు ఈ ప్రాంతంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ స్థాయిల్లో చెప్పుకోదగ్గ సీట్లను సాధించాయి. అల్లర్ల తర్వాత మత పరంగా ప్రజల మధ్య విభజనను తీసుకురావడంలో బీజేపీ సఫలమైంది. దాన్ని రాజకీయానికి వాడుకొని బాగా పుంజుకొన్నది. 2012లో ఇక్కడ 58 సీట్లకు గాను కేవలం 10 సీట్లు గెలిచిన బీజేపీ 2017లో ఏకంగా 53 సీట్లు కొల్లగొట్టింది. అప్పటిదాకా ఎస్పీ, బీఎస్పీకి మద్దతు ఇచ్చిన రైతులు, దళితులు కూడా బీజేపీ వైపే మొగ్గారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. మతపరమైన అంశాల కంటే బలంగా రైతుల ఉద్యమ ప్రభావం రాజకీయ క్షేత్రంలోకి చొచ్చుకు వచ్చింది. ఇది యోగి సర్కారుకు తలనొప్పిగా మారింది. సాగు చట్టాలు రద్దు చేసినప్పటికీ.. రైతులు బలంగా కోరుతున్న మద్దతు ధరల చట్టంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు నోరు మెదపకుండా ఉండటంతో ఈసారి ఈ ప్రాంత రైతులు సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)-రాష్ట్రీయ లోక్ దళ్(ఆరెల్డీ) కూటమి వైపు మొగ్గవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పాటు గతంలో అల్లర్లను రాజకీయ అంశంగా చూపినప్పుడు దళితులు బీజేపీ వైపు మొగ్గారు. కానీ యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయి. ఫలితంగా ఈ సారి దళితులు కూడా బీజేపీకి దూరం అవుతారని అంచనా. ఇదిలా ఉండగా, యూపీలో నమోదు అవుతున్న రోజువారీ కేసుల్లో సగం పశ్చిమ యూపీ నుంచే ఉన్నాయి. మొదటి దశలో ఎన్నికలు జరగనున్న 11 జిల్లాలు: షామ్లి, ముజఫర్నగర్, మీరట్, బాగ్పట్, ఘజియాబాద్, హాపూర్, నోయిడా, బులంధ్షహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా.
ఎస్పీ-ఆరెల్డీవైపు రైతులు
ఆరెల్డీకి జాట్లలో మంచి పట్టు ఉంది. ఇక్కడ ఆ పార్టీ గతంలో జాట్ ఓటర్ల మద్దతుతోనే తొమ్మిది దాకా సీట్లు సాధించింది. ఎస్పీకి రైతుల మద్దతు ఉంది. పశ్చిమ యూపీలో చెరకు రైతుల ప్రభావం ఎక్కువ. కొన్ని నెలలుగా యూపీ సర్కారు చెరకు రైతులకు బకాయిలు చెల్లించడం లేదు. పైగా ప్రస్తుతం ఎస్పీ అధినేత అఖిలేశ్కు రాష్ట్రమంతటా మంచి ఆదరణ లభిస్తున్నది. దీంతో గతంలో బీజేపీకి ఓటేసిన వీరంతా ఇప్పుడు ఆరెల్డీ-ఎస్పీ కూటమి వైపు చూస్తారని విశ్లేషకుల అంచనా.
బీకేయూ ప్రభావం
సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన యుద్ధంలో భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) కీలకంగా వ్యవహరించింది. ఈ రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్ నేతృత్వంలోనే ఉద్యమం అంతా సాగింది. బీకేయూ ప్రధాన కార్యాలయం ముజఫర్నగర్లోని సిసౌలీ గ్రామంలో ఉంది. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న బాగ్పట్, ముజఫర్నగర్, షామ్లి, మీరట్ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బీకేయూకు మంచి పట్టు ఉంది. ఇది కూడా ఈ ప్రాంతంలో ఎన్నికలపై గొప్ప ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
బీఎస్పీ ప్రభావం
వాస్తవానికి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే పశ్చిమ యూపీలో బీఎస్పీ మొదటి నుంచీ బలంగా ఉన్న విషయాన్ని కొట్టి పారేయవద్దని, ఈ సారి కూడా బీఎస్పీ ఇక్కడ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయవచ్చునని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక్కడ బీజేపీకి ఎస్పీ కంటే బీఎస్పీ నుంచే గట్టి పోటీ ఎదురు కావచ్చని అంచనా వేస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పశ్చిమ యూపీలో 53 సీట్లు, బీఎస్పీ, ఎస్పీలకు చెరో రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే బీఎస్పీ ఈ ప్రాంతంలో 30 శాసనసభ స్థానాల్లో రెండో స్థానంలో నిలవడం విశేషం. అంతే కాకుండా 2012 శాసన సభ ఎన్నికల్లో బీఎస్పీ ఇక్కడ మిగిలిన అన్ని పార్టీల కంటే ఎక్కువగా 20 సీట్లు గెలుచుకొన్నది. 24 స్థానాల్లో రెండవ స్థానంలో నిలిచింది. అంటే గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మిగతా పార్టీల ప్రదర్శనతో సంబంధం లేకుండా పశ్చిమ ఉత్తరప్రదేశ్లో మాత్రం బీఎస్పీకి సీట్లు తగ్గినప్పటికీ ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదు. పశ్చిమ యూపీలో ఈ సారి కూడా జెండా పాతే అవకాశాలు ఉన్నాయి.