లక్నో : యూపీ ప్రభుత్వం కొవిడ్-19 నియంత్రణలను శుక్రవారం మరింతగా సడలించింది. జులై 5 నుంచి కరోనా నిబంధనలు పాటిస్తూ మల్టీప్లెక్స్లు, సినిమా థియేటర్లు, జిమ్లను తెరిచేందుకు వెసులుబాటు కల్పించింది. సీఎం యోగి ఆదిత్యానాధ్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్ధాయి సమావేశంలో అన్లాక్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సినిమా హాళ్లు మూతపడటంతో నిర్వాహకులు, సిబ్బంది ఇబ్బందులను కూడా సానుభూతితో పరిశీలించాల్సి ఉందని సీఎం యోగి పేర్కొన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. హెల్త్ ఏటీఎంల్లో ప్రజలు బీపీ, పల్స్ రేట్, బీఎంఐ, కొవ్వు, ఎత్తు, శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్ధాయిలు వంటి ప్రమాణాలను పరీక్షించుకోవచ్చని చెప్పారు. హెల్త్ ఏటీఎంల నిర్వహణపై హెల్త్ వర్కర్లు, సాంకేతిక సిబ్బందికి శిక్షణ ఇస్తామని తెలిపారు.