లక్నో: మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ఏర్పాటు, వినియోగం ప్రాథమిక హక్కు కాదని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన ఒక పిటిషన్ను కొట్టివేసింది. గత ఏడాది డిసెంబర్ 3న బదౌన్ జిల్లాకు చెందిన బిసౌలీ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వును ఇర్ఫాన్ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశాడు. ధోరన్పూర్ గ్రామంలోని నూరి మసీదులో ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్ను ఏర్పాటు చేసేందుకు అనుమతి నిరాకరించారించారని తెలిపాడు. ఈ ఉత్తర్వు చట్ట విరుద్ధమని, ప్రాథమిక హక్కులు, చట్టపరమైన హక్కులను ఉల్లంఘిస్తున్నదని తన పిటిషన్లో పేర్కొన్నాడు.
జస్టిస్ వివేక్ కుమార్, జస్టిస్ వికాస్లతో కూడిన దిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం రాజ్యాంగ హక్కు కాదని తెలిపింది. చట్టంలో దీని గురించి ఎక్కడా లేదని పేర్కొంది. అలాగే ఆజాన్ ఇస్లాం మతాచారంలో ఒక భాగమని కోర్టు చెప్పింది. అయితే లౌడ్ స్పీకర్ల ద్వారా ఆజాన్ వినిపించడం ఆ మతంలో భాగం కాదని స్పష్టం చేసింది.
మసీదుల్లో లౌడ్ స్పీకర్ల అంశానికి సంబంధించిన పిటిషన్లను గతంలో కూడా కోర్టులు కొట్టివేసిన సంగతిని అలహాబాద్ హైకోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు డివిజన్ బెంచ్ బుధవారం పేర్కొంది.