బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా రూపొందించిన శాటిలైట్ను త్వరలో లాంచ్ చేయనున్నారు. దీని కోసం ఆ ఉపగ్రహాన్ని అమెరికా యుద్ధ విమానంలో భారత్కు తరలించారు. నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ (NISAR) ఉపగ్రహాన్ని సీ-17 విమానంలో కాలిఫోర్నియా నుంచి బెంగళూరుకు బుధవారం చేర్చారు. ప్రపంచ వ్యాప్తంగా భూమి క్రస్ట్, ఉపరితలం, మంచు ప్రాంతాల్లో మార్పులను పరిశీలించేందుకు అమెరికా, భారత్ కలిసి సంయుక్తంగా ఈ మిషన్ చేపట్టనున్నాయి. ‘నిసార్’ ఉపగ్రహం ద్వారా భూ పర్యావరణ వ్యవస్థలలో మార్పులను గమనిస్తారు. అలాగే భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు, సముద్ర మట్టం పెరుగుదల వంటి ప్రకృతి వైపరీత్యాల సంకేతాలను ఈ శాటిలైట్ గుర్తించడంతోపాటు హెచ్చరికలు జారీ చేస్తుంది. తద్వారా భూమి క్రస్ట్, ఉపరితలంలో జరుగుతున్న మార్పుల అధ్యయానికి ఇది సహకరిస్తుంది.
కాగా, హిమాలయాల్లోని హిమానీనదాలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల పరిశీలన, పర్యవేక్షణకు ఈ శాటిలైట్ను ఇస్రో వినియోగిస్తుంది. ఎస్యూవీ వాహనం అంత పరిమాణం, సుమారు 2,800 కిలోల బరువున్న నిసార్ ఉపగ్రహంలో ఎల్-బ్యాండ్, ఎస్-బ్యాండ్, సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్ఏఆర్) వంటి పరికరాలు ఉన్నాయి. ఎస్-బ్యాండ్, ఎస్ఏఆర్ ద్వారా మేఘాలు, దట్టమైన అడవుల పై నుంచి కూడా కింద ఉన్న వాటిని స్పష్టంగా చూడవచ్చు. అధిక రిజల్యూషన్ చిత్రాలను రూపొందించవచ్చు.
మరోవైపు 2024లో ఆంధ్రప్రదేశ్లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ శాటిలైట్ను ధ్రువ కక్ష్యలోకి పంపనున్నారు. అమెరికా, భారత్ మధ్య పౌర, అంతరిక్ష సహకారంలో మరో ప్రధాన అడుగు ఈ మిషన్ అని చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.
Touchdown in Bengaluru! @ISRO receives NISAR (@NASA-ISRO Synthetic Aperture Radar) on a @USAirforce C-17 from @NASAJPL in California, setting the stage for final integration of the Earth observation satellite, a true symbol of #USIndia civil space collaboration. #USIndiaTogether pic.twitter.com/l0a5pa1uxV
— U.S. Consulate General Chennai (@USAndChennai) March 8, 2023