Aadhaar Update | ఏడు సంవత్సరాలు నిండిన పిల్లల ఆధార్లో బయోమెట్రిక్ సమాచారాన్ని అప్డేట్ చేయడం కీలకమని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) పేర్కొంది. పిల్లల తల్లిదండ్రులు ఆధార్ను అప్డేట్ చేయాలని ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మంగళవారం సూచించింది. ఈ మేరకు మంత్రిత్వశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. తల్లిదండ్రులు, సంరక్షకులు ఎవరైనా ఆధార్ కేంద్రానికి వెళ్లి పిల్లల ఆధార్ వివరాలను అప్డేట్ చేయవచ్చని పేర్కొంది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఫొటో, పేరు, పుట్టిన తేదీ, జెండర్, చిరునామా వంటి వివరాలను మాత్రమే ఆధార్లో నమోదు చేస్తారని పేర్కొంది. పిల్లల వేలిముద్రలు, ఐరిస్ తీసుకోరని చెప్పింది.
పిల్లల వయసు ఐదేళ్లు దాటిన వెంటనే వేలిముద్రలు, ఐరిస్తో పాటు ఫొటోను సైతం ఆధార్లో అప్డేట్ చేయించాలని చెప్పింది. ఈ అప్డేట్ ఐదు నుంచి ఏడేళ్ల లోపు పిల్లలకు పూర్తిగా ఉచితమని.. ఏడు సంవత్సరాల తర్వాత అప్డేట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు రూ.100 వసూలు చేయనున్నట్లు చెప్పింది. తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ సకాలంలో చేయకపోతే పిల్లల ఆధార్ నంబర్ను డీయాక్టివేట్ చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. క్రమం తప్పకుండా, బయోమెట్రిక్ డేటా పిల్లలకు అనేక అనేక సౌకర్యాలుంటాయని చెప్పింది. పాఠశాల అడ్మిషన్, పరీక్ష రిజిస్ట్రేషన్, స్కాలర్షిప్, ప్రభుత్వ ప్రత్యక్ష నగదు బదిలీ తదితర పథకాలకు ఆధార్ అవసరమవుతుందని పేర్కొంది. తల్లిదండ్రులు క్రమం తప్పకుండా తమ పిల్లల ఆధార్ వివరాలను అప్డేట్ చేయించాలని ఉడాయ్ కోరింది.