లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఘోరం జరిగింది. పబ్జీ (PUBG)ఆడొద్దని చెప్పినందుకు కన్న తల్లినే కాల్చి చంపాడో బాలుడు. తల్లి మృతదేహంతో రెండు రోజులపాటు ఇంట్లోనే ఉన్నాడు. హత్యను కప్పిపుచ్చేందుకు పోలీసులకు కట్టుకథలు చెప్పాడు. అయితే పోలీసులు తమదైన స్టైలులో ప్రశ్నించేసరికి అసలు విషయం ఒప్పుకున్నాడు.
సాధన అనే మహిళ.. తన 16 ఏండ్ల కొడుకు, పదేండ్ల కుమార్తెతో కలిసి లక్నోలోని పీజీఐ ప్రాంతంలో నివసిస్తున్నది. ఆమె భర్త ఆర్మీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం కోల్కతాలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో కుటుంబ బాధ్యత అంతా ఆమె చూసుకునేది. అయితే సాధన కుమారుడు పబ్జీ గేమ్కు బానిసైపోయాడు. దీంతో ఆ అలవాటును మానుకోవాలని హెచ్చరించింది. అయితే తరచూ తనను ఆడుకోకుండా చేస్తున్న తల్లిపై కోపం పెంచుకున్నాడు. శనివారం రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో.. తన తండ్రి లైసెన్స్ తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు. ఆ తర్వాత మూడు రోజుల పాటు తల్లి శవాన్ని ఇంట్లోనే దాచాడు. మృతదేహం దుర్వాసన రాకుండా గదుల్లో రోజూ రూమ్ ఫ్రెష్నర్లను స్ప్రే చేశాడు.
కాగా, మంగళవారం రాత్రి తన తండ్రికి ఫోన్ చేసిన బాలుడు.. ఇంట్లో రిపేర్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రిషన్ అమ్మను చంపేశాడని చెప్పాడు. ఇదే విషయాన్ని అతడు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కుల్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన తల్లిని చంపేశారని పోలీసులకు ఆ బాలుడు చెప్పాడు. అయితే ఆమె కూతురు మాత్రం అసలు విషయం చెప్పేసింది. హత్యకు సంబంధించిన విషయాన్ని ఎవరికైనా చెబితే తనను కూడా చంపేస్తానని బెదిరించాడని వెల్లడించింది. దీంతో పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా నిజం ఒప్పుకున్నాడని అధికారులు తెలిపారు.