లక్నో: ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మూడో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మూడో విడుతలో 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. మొత్తం 627 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2 కోట్ల 15 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
మూడో విడుత ఎన్నికల్లో హేమాహేమీలు బరిలో ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న కర్హల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరుగుతున్నది. ఆయనకు పోటీగా బీజేపీ నుంచి కేంద్రమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ బరిలోకి దిగారు. ఇక అఖిలేశ్ బాబాయి శివపాల్ సింగ్ యాదవ్.. జశ్వంత్నగర్ నుంచి పోటీచేస్తున్నారు. కాగా, 2017లో ఈ 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 49, ఎస్పీ 9, కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకున్నది.
ఇక పంజాబ్లోని 117 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 1,304 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 93 మంది మహిళలు. 2017లో పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు 77, ఆప్కు 20, ఎస్ఏడీ–బీజేపీకి 18 సీట్లు వచ్చాయి.