లక్నో: మల విసర్జన సమయంలో తన శరీరంలోకి పాము (Snake) ప్రవేశించిందని ఒక వ్యక్తి ఆరోపించాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్లకు ఈ విషయం చెప్పాడు. సీటీ స్కాన్ తీసి పరిశీలించిన వైద్యులు అతడి శరీరంలోకి పాము ప్రవేశించలేదని నిర్ధారించారు. అయితే మరో ఆసుపత్రికి తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు చెప్పడంతో అతడ్ని డిశ్చార్జ్ చేశారు. విస్తూపోయే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో జరిగింది. మహేంద్ర అనే వ్యక్తి కడుపు నొప్పితో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వేళ హర్దోయ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి అతడ్ని తీసుకెళ్లారు. రాత్రి వేళ బహిరంగ ప్రాంతంలో మల విసర్జన చేస్తున్న సమయంలో తన శరీరంలోకి పాము ప్రవేశించినట్లు అతడు చెప్పాడు.
కాగా, వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది మహేంద్రను ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశారు. వైద్యులు అతడ్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా పాము కాటు ఆనవాళ్లు కనిపించలేదు. అతడి శరీరంలో కూడా దానిని గుర్తించలేదు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో మరునాడు సీటీ స్కాన్ కూడా చేశారు. అతడి శరీరంలో ఎలాంటి పాము లేదని కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పారు. డ్రగ్స్కు బానిస కావడంతో తరచుగా కడుపు నొప్పి రావచ్చని వివరించారు. అయినప్పటికీ మహేంద్ర కుటుంబ సభ్యులకు నమ్మకం కలగేదు. అతడి శరీరంలో పాము ఉందన్న భ్రమలో వారు ఉన్నారు. మరో ఆసుపత్రికి రిఫర్ చేయాలని కోరారు. దీంతో మహేంద్రను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్లు తెలిపారు.