చెన్నై: తమిళనాడు గవర్నర్ (Governor) ఆర్ఎన్ రవి మరో వివాదానికి తెరలేపారు. బిల్లులను ఆమోదించకుండా నిలిపివేయడం అంటే యోగ్యమైన భాషలో అర్థం తిరస్కరించడమేనని అన్నారు. దీంతో గవర్నర్ తీరుపై సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవి గురువారం రాజ్భవన్లో నిర్వహించిన ‘థింక్ టు డేర్’ కార్యక్రమంలో భాగంగా సివిల్ సర్వీస్ ఔత్సాహికులతో ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఆమోదం కోసం అసెంబ్లీ పంపే బిల్లుల గురించి ఆయన మాట్లాడారు. బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వంతో వాగ్వాదం జరిగినప్పుడు గవర్నర్కు మూడు ఛాయిస్లు ఉన్నాయని తెలిపారు. ‘ఒకటి బిల్లులను ఆమోదించడం. రెండోది నిలిపివేయడం – అంటే బిల్లు చనిపోయిందని అర్థం. సుప్రీంకోర్టు, రాజ్యాంగ పరమైన భాషలో చెప్పాలంటే తిరస్కరించడం. మూడోది బిల్లును రిజర్వ్ చేయడం. ఇదీ గవర్నర్ విచక్షణ’ అని అన్నారు.
కాగా, బిల్లు రాజ్యాంగ పరిమితిని ఉల్లంఘించకుండా, రాష్ట్ర ప్రభుత్వ సామర్థ్యాన్ని అధిగమించకుండా ఉండేందుకు గవర్నర్ పరిశీలిస్తారని ఆర్ఎన్ రవి తెలిపారు. గవర్నర్ పదవిని రాజ్యాంగం సృష్టించిందని, ఆ పాత్ర, బాధ్యతలను అందులో నిర్వహించారని చెప్పారు. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం గవర్నర్ ప్రధానమైన బాధ్యతని అన్నారు. కేంద్రం లేదా రాష్ట్రం రాజ్యాంగం ప్రకారం పని చేయాలని, లేకపోతే రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షించుకుంటాం? అని వ్యాఖ్యానించారు. ‘ఒక రాజకీయ పార్టీకి అసెంబ్లీలో మెజారిటీ ఉంటే రాజ్యాంగ పరిమితిని ఉల్లంఘించేలా చట్టం చేస్తారా? ఏ బిల్లునైనా అలా ఆమోదిస్తారా?’ అని గవర్నర్ ప్రశ్నించారు.
మరోవైపు గవర్నర్ ఆర్ఎన్ రవి తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలపై సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. మనీ బిల్లును కూడా గవర్నర్ ఆమోదించలేదని విమర్శించారు. ఆ బిల్లును నిలిపివేయలేదన్న విషయాన్ని గవర్నర్ స్వయంగా అంగీకరించారని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి బిల్లులను ఆమోదించకుండా, ధైర్యంగా వ్యతిరేకించకుండా నిలుపుదల చేయడం తగదన్నారు. ‘గవర్నర్ తన అధికార వైఖరిని నిర్లక్ష్యంగా బహిర్గతం చేయడం ఉల్లంఘనే. ఆన్లైన్ రమ్మీని నిషేధించే మనీ బిల్లుకు ఆయన సమ్మతి ఇవ్వలేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం’ అని సీఎం స్టాలిన్ విమర్శించారు. బిల్లుల గురించి గవర్నర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడే గవర్నర్గా చేసిన ప్రమాణాన్ని నిజం చేసినట్లు అవుతుందన్నారు.
అసెంబ్లీ రెండవసారి కూడా బిల్లును ఆమోదించి పంపితే గవర్నర్ తప్పనిసరిగా ఆమోదం తెలుపాలని సీఎం స్టాలిన్ అన్నారు. అయితే చట్టసభలో ప్రజాప్రతినిధులు రూపొందించిన బిల్లులు, ఆర్డినెన్స్లు, సవరణల విషయంలో కాలయాపన చేయడం గవర్నర్కు అలవాటుగా మారిందని విమర్శించారు. దీని వల్ల పరిపాలన కుంటుపడుతోందని అన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ సంక్షిప్త లిపి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తనను తాను నియంతగా ఆయన భావించుకోకూడదు’ అని స్టాలిన్ దుయ్యబట్టారు.