చెన్నై: ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా తత్కాల్ రైలు టిక్కెట్ల బుకింగ్కు నకిలీ సాఫ్ట్వేర్ (Fake Software) ను ఒక వ్యక్తి సృష్టించాడు. పలువురు ఏజెంట్లకు దీనిని విక్రయించగా వారు భారీగా ఆదాయం సంపాదించారు. ఈ విషయం బయటపడటంతో ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు తమిళనాడులో అరెస్ట్ చేశారు. నిందితుడ్ని 40 ఏళ్ల షంషేర్ ఆలంగా గుర్తించారు. ఆలం గత పదేళ్లుగా ముంబై సమీపంలోని టిట్వాలాలో పనిచేస్తున్నాడు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా తత్కాల్ ట్రైన్ టిక్కెట్లను బుక్ చేసేందుకు ‘ఫ్యూజన్’ అనే నకిలీ సాఫ్ట్వేర్ను అతడు అభివృద్ధి చేశాడు.
కాగా, ఆలం డెవలప్ చేసిన షార్ప్, తేజ్, నెక్సస్ ++, ఫ్యూజన్ సాఫ్ట్వేర్లను కస్టమర్లకు తొలుత నెలకు రూ.500 చొప్పున అద్దెకు ఇచ్చేవాడు. ఆ తర్వాత బీహార్లోని దాన్పూర్కు చెందిన 32 ఏళ్ల శైలేష్ యాదవ్తో అతడు చేతులు కలిపాడు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా తత్కాల్ ట్రైన్ టిక్కెట్లను బుక్ చేసే ‘ఫ్యూజన్’ నకిలీ సాఫ్ట్వేర్ను దేశవ్యాప్తంగా పలువురు ఏజెంట్లకు అమ్మేందుకు ప్లాన్ చేశాడు. దీంతో యాదవ్ తన వెబ్సైట్ (tatkalsoftwareall.in) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న టికెట్ బుకింగ్ ఏజెంట్లకు ఈ సాఫ్ట్వేర్ను విక్రయించాడు.
మరోవైపు 2022 జూలైలో తమిళనాడులోని వెల్లూరుకు చెందిన ఐదుగురు టిక్కెట్ బుకింగ్ ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గత పదేళ్లుగా ఫేక్ ఐడీలను ఉపయోగించి, నకిలీ ప్రయాణికుల పేర్లతో తత్కాల్ టిక్కెట్లను వేగంగా బుక్ చేసేందుకు ఈ నకిలీ వెబ్సైట్ వినియోగిస్తున్నట్లు ఆ ఏజెంట్లు పోలీసులకు తెలిపారు. దీని ద్వారా సుమారు రూ.50 కోట్ల వరకు సంపాదించినట్లు వెల్లడించారు.
కాగా, గత ఏడాది సెప్టెంబర్లో ఈ సాఫ్ట్వేర్ అమ్మిన శైలేష్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. యాదవ్ను ప్రశ్నించగా ఈ సాఫ్ట్వేర్ను సృష్టించి ఈ కుట్రకు పాల్పడిన ప్రధాన వ్యక్తి షంషేర్ ఆలం అని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆర్పీఎఫ్ అధికారులు తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఆలంను శనివారం అరెస్ట్ చేశారు. ముంబైలోని కుర్లా, దాదర్తోపాటు జోధ్పూర్ పోలీస్ స్టేషన్లలో అతడిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Also Read: