లక్నో, ఆగస్టు 2: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో పాఠశాల విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి రాష్ట్రంలోని యోగి సర్కారు గత మూడు నెలలుగా నిధులను విడుదల చేయడం లేదు. పసిపిల్లల ఆకలి తీర్చడానికి ఉద్దేశించిన నిధులను ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. ప్రభుత్వ బాధ్యతారాహిత్య వైఖరి కారణంగా పసిమొగ్గలు పడుతున్న ఆకలిబాధలను చూడలేని స్కూల్ టీచర్లు, గ్రామ సర్పంచ్లు.. తమ జేబులో నుంచి డబ్బును తీసి విద్యార్థులకు భోజనం పెట్టిస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు కొలువుదీరిన ఉత్తరప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతున్న తీరు తాజాగా వెలుగులోకి వచ్చింది.
పిల్లల నోటికాడి కూడు లాక్కొని..
యూపీలోని సీతాపూర్, గోండా, ఘాజీపూర్, లఖింపూర్ ఖీరీతో సహా పలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నడపడానికి నిధులు లేవని స్కూల్ హెడ్మాస్టర్లు, టీచర్లు, సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన మూడు నెలలుగా పథకానికి కావాల్సిన నిధుల విడుదల నిలిచిపోయిందని, దీంతో విద్యార్థులకు అన్నం పెట్టలేని పరిస్థితులు దాపురించాయని వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులు పేదలని, అందుకే వారి ఆకలి బాధలు చూడలేక వచ్చే జీతం డబ్బును బియ్యం, నూనె, పప్పులు కొనేందుకు వెచ్చిస్తున్నామని చెబుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం బకాయిలు ఒక్కో జిల్లాలో రూ. 2.5-రూ. 3 కోట్ల చొప్పున పేరుకుపోయినట్టు తెలిపారు. ఇదే విషయమై విద్యాశాఖ అధికారులను ‘న్యూస్క్లిక్’ వెబ్సైట్ ప్రతినిధులు సంప్రదించగా.. బకాయిలకు సంబంధించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపామని, అయినప్పటికీ నిధుల విడుదలలో జాప్యం తలెత్తుతున్నదని వెల్లడించారు. పిల్లల నోటికాడి కూడును లాక్కొంటున్న యోగిసర్కారు.. ఇమేజ్ పెంచుకునేందుకు మాత్రం భారీగా డబ్బులు ఖర్చుపెడుతున్నదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ టీచర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధరలు పెరిగినా.. కోటా పెంచలేదు
కరోనా సంక్షోభం, లాక్డౌన్ తదనంతరం దేశంలో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిలో పెచ్చరిల్లిందని, బియ్యం, నూనె, పప్పులు, వంటగ్యాస్ ధరలు రెండు, మూడు రెట్లు పెరిగిపోయాయని స్కూల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగిపోయినప్పటికీ, మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు చెల్లించే మొత్తాన్ని ప్రభుత్వం 2020 జూలై 1 నుంచి ఏ మాత్రం పెంచలేదని వాపోతున్నాయి. మధ్యాహ్న భోజన పథకం కింద ఒక్కో ప్రైమరీ స్థాయి స్టూడెంట్కు రూ. 4.97, అప్పర్ ప్రైమరీ స్థాయి స్టూడెంట్కు రూ. 7.45 చొప్పున నిధులను మంజూరు చేస్తున్నారు. ఇందులో 60 శాతం వాటాను కేంద్రం, మిగిలిన 40 శాతం వాటాను రాష్ట్రప్రభుత్వం భరిస్తున్నాయి.
ప్రచారమే బీజేపీకి ముఖ్యమైంది
మధ్యాహ్న భోజన పథకం కింద మా జిల్లాకు రూ. 2.3 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉన్నది. ఆ మొత్తాన్ని బీజేపీ సర్కారు ఇతర కార్యకలాపాలకు మళ్లించింది.విద్యార్థుల భవిష్యత్తు కంటే సొంత ప్రచారమే వాళ్లకు ముఖ్యమైంది.
– అజయ్ సింగ్, టీచర్, సీతాపూర్ జిల్లా
సొంత డబ్బు ఖర్చు
నిధులు పెండింగ్లో ఉన్నాయని పేదలైన ఆ పిల్లలకు అన్నం పెట్టకుండా కడుపు మాడ్చలేం కదా. అందుకే దగ్గరలోని కిరాణా దుకాణాల్లో సరుకులను అప్పుగా తీసుకొస్తూ నెట్టుకొస్తున్నాం. టీచర్లతో పాటు నేను కూడా నా జేబు నుంచి కొంత డబ్బును ఖర్చుచేశా..
– అశ్వనీ రాయ్, ఘాజీపూర్లోని రాజాపూర్ గ్రామ సర్పంచ్
విద్యాశాఖ బెదిరింపులు
యూపీలో అన్ని జిల్లాల పాఠశాలల్లో ఇదే పరిస్థితి. రోజూ దాదాపు 150 మంది విద్యార్థులు పాఠశాలకు వస్తారు. మధ్యాహ్న భోజనానికి రూ.750-రూ.800 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. స్కీమ్ నిలిపేస్తే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ నుంచి నోటీసులు వస్తున్నాయి.
– వీరేంద్ర మిశ్రా, స్కూల్ హెడ్ మాస్టర్, రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ జాతీయ ప్రతినిధి
యూపీలో డబుల్ ఇంజిన్ డిజాస్టర్
ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల ఆకలి కేకలపై పత్రికల్లో వచ్చిన కథనాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘బుల్డోజర్ల కోసం (యూపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారి ఇండ్లు కూల్చేందుకు) కోట్ల రూపాయలు వెచ్చించే యూపీ ప్రభుత్వం ఇప్పుడు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు నిధుల కొరతను ఎదుర్కొంటున్నది. దేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న మొత్తం 9.27 లక్షల మంది బాలల్లో 40శాతం యూపీలోనే ఉన్నారు’ అంటూ ఎత్తిచూపారు. ఇది డబుల్ ఇంజిన్ డిజాస్టర్ అని పేర్కొంటూ ఆ కథనాలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పెట్టారు.