పొలంకాడ మీటర్లతో రైతుకెంత నష్టమో కేసీఆర్కు తెలుసు.. కేంద్ర సర్కారు చేసే కుట్రలేందో
కూడా ఆయనకు తెలుసు.. అందుకే రైతన్న తరఫున, రైతుగా కేంద్రంపై తిరగబడ్డరు.. గొంతులో ప్రాణం ఉండగా మీటర్లు పెట్టనియ్యనన్నరు.. కేసీఆర్ మాటే ఇప్పుడు యూపీ రైతుల బాట అయ్యింది..సర్కారు తప్పుడు నిర్ణయాన్ని ఎదురించే గళమయ్యింది..
లక్నో, నవంబర్ 19: పొలంకాడ మీటర్లు పెట్టి రైతన్న పొట్ట కొట్టాలని చూస్తున్న బీజేపీ సర్కారుపై రైతన్నలు యుద్ధం మొదలెట్టారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మొదలు పెట్టిన నిరసన.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వరకు పాకింది. బోర్లకు మీటర్లు పెట్టినందుకు అక్కడి రైతులంతా కలిసి ప్రభుత్వంపై ఎదురు తిరిగారు. మీటర్లను పీక్కొచ్చి ఆఫీసు ముందు పారబోశారు. ఆ మీటర్లను పెట్టిన అధికారులను నిర్బంధించి తమ నిరసనను వ్యక్తం చేశారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో రైతుల పొలం వద్ద నీళ్ల పంపులకు పశ్చిమ్ విద్యుత్ విట్రన్ నిగం లిమిటెడ్ (పీవీవీఎన్ఎల్) అధికారులు మీటర్లు బిగించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు భారతీయ వికాస్ యూనియన్ (బీకేయూ) ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. మీటర్లన్నింటినీ పీకి తీసుకొచ్చి పీవీవీఎన్ఎల్ కార్యాలయం ముందు పడేసి, మీటర్లను ఆఫీస్లోనే పెట్టుకోవాలని తేల్చిచెప్పారు. అధికారులను గంటల పాటు నిర్బంధించారు. మీటర్లు బిగించటం ఆపకపోతే ఉద్యమాన్ని ఉత్తరప్రదేశ్ అంతటా తీసుకెళ్తామని హెచ్చరించారు. ఇప్పటికే వ్యవసాయ చట్టాలతో చేతులు కాల్చుకున్న మోదీ సర్కారు.. ఇప్పుడు మీటర్లతో రైతులపై దాడి చేస్తున్నదని మండిపడ్డారు.
నిరసన తీవ్రతరం
‘ప్రభుత్వం మా డిమాండ్లను పట్టించుకోవటం లేదు. ఇప్పటి దాకా రోడ్లనే నిర్బంధించాం. మా డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో నిరసనలను తీవ్రతరం చేస్తాం’ అని అన్నదాతలు హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మీటర్లను బిగించేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. 70 ఏండ్లుగా దేశం కూడబెట్టుకొన్న ఆస్తులను ఈ సర్కారు తన కార్పొరేట్ దోస్తులకు తెగనమ్ముతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు, విద్యుత్తు, అడవి, భూమి, పరిశ్రమలు, పాఠశాలలు.. ఇలా అన్నింటిని కోటీశ్వరులకు అప్పగిస్తున్నదని విమర్శించారు. ఉచిత విద్యుత్తు ఇస్తానని హామీ ఇచ్చిన యోగి సర్కారు.. ఇప్పుడు మీటర్లు పెట్టి రైతుల వద్ద ఇష్టమొచ్చినట్టు బిల్లులు వసూలు చేయాలని చూస్తున్నదని రైతు నేత అంకిత్ తోమర్ మండిపడ్డారు. వచ్చే అరకొర ఆదాయంతో తడిసిమోపెడయ్యే బిల్లులను కట్టలేమని స్పష్టం చేశారు. గతంలో నెలకు రూ.2 వేలకు మించి బిల్లు వచ్చేది కాదని, మీటర్లు బిగించాక రూ.10 వేలు దాటుతున్నదని వివరించారు. చెరకు పంట బకాయిలు ఇవ్వకపోగా, భారీ బిల్లులతో రైతును నలిపేయాలని చూస్తున్నదని మండిపడ్డారు.