లక్నో: బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో విషాద సంఘటన జరిగింది. ఎరువుల కోసం లైన్లో నిల్చొని నిరీక్షిస్తున్న ఒక రైతు కుప్పకూలి మరణించాడు. యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హత్వంత్ బ్లాక్ పరిధిలోని షేక్పురా గ్రామానికి చెందిన 60 ఏళ్ల రైతు రామ్ బ్రజేష్, శుక్రవారం ఎరువుల కోసం షాపు వద్ద ఉన్న భారీ క్యూ లైన్లో నిల్చొని ఉన్నాడు. తన వంతు కోసం ఎదురుచూస్తున్న ఆ రైతు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో రామ్ బ్రజేష్ను స్థానికులు వెంటనే కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే పోస్ట్మార్టం నిర్వహించకుండానే ఆ వృద్ధ రైతు మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు ఉత్తర ప్రదేశ్ రైతులు ఎరువుల కోసం నానా అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ఆ రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడింది. దీంతో ప్రభుత్వం నిర్వహించే కోఆపరేటివ్ సొసైటీల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. బారీ క్యూలైన్లలో గంటల తరబడి నిల్చున్నప్పటికీ ఎరువులు అందకపోవడంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ఎరువులను అధిక ధరకు అమ్ముతున్నారని, నాణ్యత లేనివి అంటగడుతున్నారని యూపీ రైతులు ఆరోపిస్తున్నారు. ఆగ్రా జిల్లా కిర్వాలీ బ్లాక్లోని ఎరువుల గోదాం వద్ద పలువురు రైతులు శనివారం నిరసనకు దిగారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై వారు మండిపడ్డారు.