లక్నో: హెచ్ఐవీ పాజిటివ్ గర్భిణీని ముట్టుకునేందుకు, ఆమెకు డెలివరీ చేసేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో పుట్టిన బాబు చనిపోయాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల మహిళకు ఏడాది కిందట పెళ్లి అయ్యింది. అనంతరం ఎయిడ్స్ సోకిన ఆ యువతి, భర్తను వీడి పుట్టింట్లో ఉంటున్నది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఎన్ఏసీవో) ద్వారా చికిత్స పొందుతున్న ఆమె గర్భం దాల్చింది. నెలలు నిండటంతో సహజ కాన్పునకు ప్రైవేట్ ఆసుపత్రిలో రూ.20,000 అవుతుందని చెప్పారు. ఆ స్థోమత లేని ఆమె తండ్రి, ఎన్ఏసీవో అధికారిణిని సంప్రదించాడు. ఆమె సూచనతో నిండు గర్భిణీ అయిన కుమార్తెను ప్రసవం కోసం ఫిరోజాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
కాగా, ఐహెచ్ఐవీ పాజిటివ్ అయిన ఆ గర్భిణీని ముట్టుకునేందుకు, ఆమెకు డెలివరీ చేసేందుకు ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. దీంతో ఆ మహిళ పలు గంటలపాటు పురిటి నొప్పులతో విలవిలలాడిపోయింది. ఆమె తండ్రి ఎంత వేడుకున్నప్పటికీ ఎవరూ స్పందించలేదు. చివరకు ఎన్ఏసీవో అధికారిణి జోక్యంతో ఒక నర్సు ఆ గర్భిణీని డెలివరీ రూమ్కు తీసుకెళ్లగా బాబుకు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువును ఆ కుటుంబ సభ్యులకు చూపలేదు. శ్వాస అందక ఇబ్బంది పడుతున్న బాబును నవజాత శిశు సంరక్షణ యూనిట్కు తీసుకెళ్లారు. ఆ మరునాడు బాబు చనిపోయినట్లు చెప్పారు.
మరోవైపు వైద్యుల నిరక్ష్యం కారణంగా శిశివును తమ కుమార్తె కోల్పోయిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫిరోజాబాద్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంగీత తెలిపారు.