లక్నో : క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 9న యోగి ఆదిత్యానాధ్ సర్కార్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యూపీ అంతటా నిరసన ప్రదర్శనలు నిర్వహించనుంది. యోగి సర్కార్ విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్ధితి, నిరుద్యోగం, రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు చేపడతామని యూపీ కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
బీజేపీని అధికారం నుంచి కూలదోసే నినాదంతో ఈ ప్రదర్శనలు చేపడతామని వెల్లడించాయి. ఆగస్ట్ 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు వివిధ నిరసన రూపాల్లో యోగి సర్కార్ వైఫల్యాలను ఎండగడతామని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి. కాగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ నేతృత్వంలో మూడు దశాబ్ధాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ విశ్వాసం వ్యక్తం చేశారు.