లక్నో: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లైన నేపథ్యంలో ఉత్తర పద్రేశ్ వ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో భారీగా హోర్డింగ్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తోపాటు స్థానిక నేతల ఫొటోలు ఆ బ్యానర్లలో ఉన్నాయి. అయితే ఫిరోజాబాద్లో ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్లలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫొటోలను కొందరు వ్యక్తులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. కొన్ని హోర్డింగ్లలో సీఎం యోగి ముఖం ఉన్న చోట చించివేయగా, మరి కొన్నింటిలో ఆయన చిత్రంపై నల్ల రంగు పూశారు.
కాగా, శనివారం ఉదయం దీనిని గమనించిన బీజేపీ నేతలు ఆయా ప్రాంతాల్లో నిరసనకు దిగారు. ఎమ్మెల్యే మనీష్ అసిజా ఈ నిరసనలకు నేతృత్వం వహించారు. ఇది ఒక వ్యక్తి చేసిన పని కాదని, ప్రణాళికతో జరిగిందని బీజేపీ నేతలు విమర్శించారు. నగరంలో శాంతిభద్రతలు, ప్రశాంతతకు భంగం కలిగించేందుకు సంఘ విద్రోహులు చేసిన పని అని ఆరోపించారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు వెంటనే స్పందించారు. ఆయా ప్రాంతాల్లో కొత్త హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. ఈ అంశాన్ని సీరియస్గా పరిగణిస్తున్నట్లు ఫిరోజాబాద్ జిల్లా కలెక్టర్ రవి రంజన్ తెలిపారు. ఈ పని చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి నిందితులను గుర్తిస్తామని చెప్పారు. గాంధీ పార్క్ వద్ద హోర్డింగ్లను పాడు చేసినందుకు ఇద్దరు వ్యక్తులపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.