న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా(Air India) విమానంలో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. అతడి ప్రవర్తనతో విసుగెత్తిన పైలెట్.. ఆ విమానాన్ని మళ్లీ ఢిల్లీకి తీసుకువచ్చాడు. ఈ ఘటన ఇవాళ ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 6.35 నిమిషాలకు లండన్ హీత్రూకు ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. టేకాఫ్ తీసుకున్న తర్వాత ఓ ప్రయాణికుడి విమానంలో అనుచితంగా ప్రవర్తించాడు. ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా అతను తన ప్రవర్తనను మార్చుకోలేదు. ఇద్దరు విమాన సిబ్బందిపై కూడా దాడి చేశారు. దీంతో ఆ విమానాన్ని కమాండ్ చేస్తున్న పైలెట్ దారి మళ్లించాడు.
ఉదయం 9.42 నిమిషాలకు మళ్లీ ఢిల్లీ విమానాశ్రయంలో దించాడు. ఆ ప్రయాణికుడిని దించేసి, అతన్ని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు ఎయిర్ ఇండియా తన ప్రకటనలో తెలిపింది.
విమానంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్షణ, భద్రతా, మర్యాద ముఖ్యమని ఎయిర్ ఇండియాన తన ప్రకటనలో పేర్కొన్నది. ప్రయాణికులకు జరిగిన అంతరాయానికి చింతిస్తున్నామని, మళ్లీ ఇవాళ మధ్యాహ్నం ఆ విమానం లండన్కు బయలుదేరుతుందని ప్రకనటలో తెలిపారు.
పాకిస్తాన్లోని పెషావర్ సమీపంలో ఉన్న సమయంలో.. విమానాన్ని మళ్లీ వెనక్కి తీసుకువచ్చినట్లు ఫ్లయిట్రేడార్24 ఆధారంగా తెలుస్తోంది.