అదో కంపెనీ. ముంబై కేంద్రంగా పనిచేస్తుందట. యజమాని ఎవరో కూడా సరిగ్గా తెలియదు. కనీసం అధికారిక వెబ్సైట్ కూడా లేదు. 2021కి ముందు రెండు ఆయిల్ ట్యాంకర్లు కూడా లేని ఆ కంపెనీ.. ప్రస్తుతం రూ.13 వేల కోట్ల విలువైన చమురు నౌకలను నిర్వహిస్తున్నది. కారణమేంటో తెలుసా? రష్యా చమురును పెద్ద ఎత్తున భారత్కు సరఫరా చేసి లాభాలు ఆర్జించడమే. మరి, ఈ అనామక కంపెనీకి ఆ లైసెన్సులు ఎవరు కట్టబెట్టినట్టు? ఏ ప్రయోజనాలు ఆశించి ఈ పని చేసినట్టు? బ్రిటిష్ డైలీ ‘ఫైనాన్షియల్ టైమ్స్’ తాజా కథనాన్ని విశ్లేషిస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి.
Financial times | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఐటీ మంత్రి కే తారక రామారావు చెప్పినట్టే జరుగుతున్నది. రష్యా నుంచి చౌక ధరకే ముడి చమురును దిగుమతి చేసుకొంటున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఆ ప్రయోజనాలు సామాన్యులకు దక్కకుండా చేస్తున్నది. దిగుమతి చేసుకొన్న చమురును ప్రైవేట్ రిఫైనరీలకు నామమాత్రపు ధరకు ఇస్తున్నది. ఇలా రిలయన్స్ ఎనర్జీ, నయారా ఎనర్జీ (గతంలో ఎస్సార్ గ్రూప్) పెద్ద ఎత్తున లాభం పొందినట్టు ఇప్పటికే వార్తలు గుప్పుమన్నాయి. ఈక్రమంలో తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన ఓ మిస్టరీ కంపెనీ రష్యా చమురును సరఫరా చేస్తూ రెండేండ్లలోనే రూ.వేల కోట్ల లాభాల్ని అర్జించినట్టు సమాచారం. ఈ మేరకు బ్రిటిష్ డైలీ ‘ఫైనాన్షియల్ టైమ్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది.
భారత్ దిగుమతి చేసుకొన్న మొత్తం ముడి చమురులో సగానికి పైగా చమురును ముంబైకి చెందిన గతిక్ షిప్ మేనేజ్మెంట్ అనే కంపెనీనే భారత్కు సరఫరా చేసింది. అయితే, 2021లో రెండు ఆయిల్ ట్యాంకర్లు మాత్రమే ఉన్న ఈ కంపెనీ.. గత ఏప్రిల్ నాటికి రూ.13 వేల కోట్ల విలువైన 58 చమురు నౌకలను కొనుగోలు చేయడం అనుమానాలకు తావిస్తున్నది. అంతేకాదు.. గత 18 నెలలుగా ఎగుమతుల రంగంలో ఉన్నట్టు చెబుతున్న ఈ కంపెనీ.. గత మార్చి 31నే ఎగుమతిదారుగా నమోదైంది(అయినప్పటికీ, అధికారిక కార్పొరేట్ రిజిస్ట్రీలో ఇంకా ఈ కంపెనీ పేరు కనిపించట్లేదు). గతిక్ నిర్వహిస్తున్న నౌకలకు గుర్తింపు పొందిన ఏ సంస్థల నుంచి కూడా బీమా లేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం నిర్వహిస్తున్న గతిక్ కంపెనీకి అధికారిక వెబ్సైట్ కూడా లేదు.
దీంతో గతిక్కు రష్యా చమురు సరఫరా కాంట్రాక్ట్ ఎలా వచ్చిందన్న దానిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకు చమురును దిగుమతి చేసుకొని ఆ ప్రయోజనాలను సామాన్యులకు అందజేయకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రకు తెర తీసిందని, ఇందులో భాగంగానే గతిక్ వంటి అనామక కంపెనీలకు అక్రమంగా చమురు సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టిందని సోషల్ మీడియాలో పలువురు మండిపడుతున్నారు.