బెంగళూరు: కర్ణాటకకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి పేరు మరికాసేపట్లో ఖరారు కానుంది. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలతో మాట్లాడి కొత్త ముఖ్యమంత్రిని ఖరారు చేసేందుకు బీజేపీ అధిష్ఠానం.. కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జీ కిషన్రెడ్డిలను పరిశీలకులుగా పంపింది. వారు కొద్దిసేపటి క్రితమే బెంగళూరుకు చేరుకున్నారు. కాసేపట్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, సీనియర్ నేతలు సీటీ రవి, బీఎల్ సంతోష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారిలో ఎవరి పేరును ముఖ్యమంత్రిగా ఖాయం చేస్తారో కాసేపట్లో తేలిపోనుంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ముందస్తు ప్రణాళికలో భాగంగా బీజేపీ హైకమాండ్ బీఎస్ యెడియూరప్ప చేత సీఎం పదవికి రాజీనామా చేయించింది. ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించబోతున్నది.