న్యూఢిల్లీ: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో చరిత్ర సృష్టించడంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. తొలి ప్రయత్నంలోనే ఇస్రో సోలార్ మిషన్ను విజయవంతంగా ప్రయోగించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆదిత్య ఎల్-1 శాటిలైట్ను విజయవంతంగా హాలో ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం ఇస్రో శాస్త్రవేత్తల అకుంటిత దీక్షకు నిదర్శనమని అన్నారు.
అంతరిక్ష అన్వేషణా యానంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని చెప్పారు. ఇస్రో సైంటిస్టుల అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు. క్లిష్టమైన అంతరిక్ష యాత్రల్లో విజయం సైంటిస్టుల నిబద్ధతకు నిదర్శమని కొనియాడారు. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వం కూడా ఇస్రో విజయాలకు కారణమని చెప్పారు. ఆదిత్య-L1 విజయం భారతదేశ అంతరిక్ష ప్రయత్నాల పరాక్రమాన్ని ప్రతిబింబిస్తున్నదని అన్నారు.
కాగా, సెప్టెంబర్ 2న నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్-1 మిషన్ 127 రోజులపాటు సుదీర్ఘంగా ప్రయాణించి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానానికి శుక్రవారం చేరింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇస్రో మరోసారి థ్రస్టర్లను మండించి హాలో ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది. ఇక్కడి నుంచే సూర్యుడిపై అధ్యయనం చేయనున్నది.
భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న మొదటి సూర్య-భూమి లాగ్రాంజియన్ పాయింట్ (L1) చుట్టూ ఉన్న హాలో కక్ష్య నుంచి సూర్యుడి కరోనాపై పరిశోధనలు జరుపుతుంది. లాగ్రాంజ్ పాయింట్ దగ్గర భూమి-సూర్యుని మధ్య గురుత్వాకర్షణ సమానంగా ఉంటుంది. దాంతో ఇక్కడి నుంచే పరిశోధనలు చేపట్టేందుకు ఇస్రో ప్లాన్ చేసింది.