న్యూఢిల్లీ, మార్చి 3: రైలు డ్రైవర్, సహాయ డ్రైవర్ క్రికెట్ పిచ్చి 14 మంది ప్రాణాలను బలి తీసుకుంది. గత ఏడాది అక్టోబర్ 29న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఆగి ఉన్న విశాఖపట్నం-పలాస ట్రైన్ను రాయగఢ ప్యాసింజర్ వెనుక నుంచి ఢీకొనడంతో 14 మంది మరణించారు. దీనికి డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని, వారి తమ ఫోన్లలో క్రికెట్ చూస్తూ అప్రమత్తంగా ఉండకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
ప్రయాణ సమయంలో సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం చర్చించేలా చేసిందన్నారు. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్లు అప్రమత్తంగా ఉండే వ్యవస్థను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు.