న్యూఢిల్లీ, మార్చి 14: ఒకవైపు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతుండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఈ చట్టాన్ని ఎప్పటికీ వెనక్కు తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన ఏఎన్ఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సీఏఏ రాజ్యాంగ విరుద్ధం కాదని, ఆర్టికల్ 14ను ఇది ఉల్లంఘించడం లేదని పేర్కొన్నారు. సీఏఏ ద్వారా రాజకీయ లాభనష్టాల గురించి తాము ఆలోచించడం లేదని, 2019 ఎన్నికల మేనిఫెస్టోలోనే సీఏఏ తీసుకువచ్చి పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్ శరణార్థులకు భారత పౌరసత్వం ఇస్తామని ప్రకటించామని అన్నారు.
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏను వెనక్కు తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు చేసిన ప్రకటనపై అమిత్ షా స్పందించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాదని కూటమి నేతలకూ తెలుసని పేర్కొన్నారు. సీఏఏ ద్వారా దేశంలో నేరాలు పెరుగుతాయని, యువత ఉద్యోగాలు కోల్పోతారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను షా తప్పుబట్టారు. సీఏఏ ద్వారా ప్రయోజనం పొందబోయే భారత్లో ఉన్నారని గుర్తు చేశారు. చట్టం అమలు కేంద్రం అంశమని, రాష్ర్టాలు అడ్డుకోలేవని స్పష్టంచేశారు. చట్టం అమలుచేయబోమని కేరళ, బెంగాల్, తమిళనాడు సీఎంలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.