న్యూఢిల్లీ: కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ( Mansukh Mandaviya ) మరికాసేపట్లో ఐదు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యమంత్రులు, ఆరోగ్య శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. సమావేశంలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, మహారాష్ట్ర ఆరోగ్యశాఖల మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.
ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా విస్తృతి, ఒమిక్రాన్ కేసులు, వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తీరు, థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, ఇకపై అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశం గురించి ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ ఇవాళ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.