న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చిన కొవిడ్-19 రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతున్నదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. రెండు, మూడు నెలల క్రితం 96-97 శాతంగా ఉన్న కరోనా రికవరీ రేటు ఇప్పుడు కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటంతో 91.22 శాతానికి తగ్గిపోయిందని చెప్పారు. దేశంలో కరోనా మహమ్మారి స్థితిగతులపై ఈ ఉదయం జరిగిన ఉన్నతస్థాయి మంత్రుల బృందం 24వ సమావేశంలో ఆయన పలు వివరాలను వెల్లడించారు.
గత వారం రోజులుగా దేశంలోని 149 జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్యమంత్రి హర్షవర్దన్ చెప్పారు. అదేవిధంగా 8 జిల్లాల్లో గత రెండు వారాలుగా కూడా ఒక్క కేసూ లేదని, 3 జిల్లాల్లో మూడు వారాలుగా ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదని, ఇక 63 జిల్లాల్లో అయితే గత నాలుగు వారాలుగా కూడా ఒక్క కేసు బయటపడలేదని హర్షవర్దన్ వెల్లడించారు.
క్రితం సారి జరిగిన సమావేశం నాటికి దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,53,847గా ఉందని, ఈ రోజు వరకు ఆ సంఖ్య 1,67,642కు చేరిందని మంత్రి హర్షవర్దన్ చెప్పారు. గత సమావేశం సమయానికి ఆఖరి రోజు నమోదైన అదనపు మరణాలు 123 కాగా, గడిచిన 24 గంటల్లో 780 మంది కరోనా బాధితులు మరణించారని ఆయన తెలిపారు.
కాగా, ప్రస్తుతం కరోనా బారినపడి పరిస్థితి విషమంగా ఉన్న రోగులలో 0.46 శాతం మంది వెంటిలేటర్పై ఉన్నారని, 2.31 శాతం మంది ఐసీయూల్లో ఉన్నారని, 4.51 శాతం మంది ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్లపై ఉన్నారని ఆరోగ్య మంత్రి వెల్లడించారు. అయితే కరోనా మరణాల రేటు మాత్రం క్రమంగా తగ్గుతూ వస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో మరణాల రేటు 1.28 శాతంగా ఉన్నదని తెలిపారు.
ఈ రోజు ఉదయం 9 గంటల వరకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 9.43 కోట్ల మందికిపైగా ప్రజలు కొవిడ్-19 టీకాలు తీసుకున్నారని హర్షవర్దన్ చెప్పారు. గడిచిన 24 గంటల్లో 36,91,511 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. గత వారం రోజుకు 43 లక్షల మందికి టీకాలు ఇచ్చామని, ప్రపంచంలో మరే దేశంలో ఒకరోజుకు ఇన్ని డోస్లు ఇవ్వలేదని ఆయన తెలిపారు.
వైద్యసిబ్బందిలో ఇప్పటివరకు 89 లక్షల మంది కొవిడ్-టీకా తొలి డోసు తీసుకోగా, 54 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారని ఆరోగ్యమంత్రి చెప్పారు. ఫ్రంట్లైన్ వారియర్స్లో కూడా ఇప్పటివరకు 98 లక్షల మంది టీకా తొలి డోసు వేయించుకోగా, మరో 45 లక్షల మందికిపైగా రెండో డోసు కూడా వేయించుకున్నారని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్పై అవగాన..!
ఈ లక్షణం ఉంటే పుట్టేది ఆడపిల్లే
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
వేసవిలో మామిడిపండ్లు తినొచ్చా ?