కట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 19 : నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసి 1వ వార్డు అభ్యర్థి గుర్రం గణేశ్ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. రూ.8 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికే పట్టణంలో 90శాతం పనులను పూర్తయ్యాయని మిగతా పెండింగ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.
పట్టణంలో రహదారుల మధ్యన డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో నకిరేకల్ మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అదేవిధంగా అన్ని వార్డుల్లో ఇన్చార్జిలు అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నడికుడి ఉమారాణి, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, తరాల బలరాములు, నార్కట్పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ రెగట్టే మల్లికార్జున్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నడికుడి వెంకటేశ్వర్లు, మాద నగేశ్, గుర్రం సైదులు, గడుసు సుధీర్రెడ్డి, పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, వడ్డె సైదిరెడ్డి పాల్గొన్నారు.
200 మంది టీఆర్ఎస్లో చేరిక
నకిరేకల్ మండలంలోని నోముల గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 200మంది కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.