న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లు ‘చాంపియన్’ల్లా వృద్ధి చెందేందుకు రూ.10వేల కోట్లతో నిధిని ఏర్పాటుచేస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశ ఆర్థిక వృద్ధికి ఎంఎస్ఎంఈలను చోదక శక్తులుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రతిపాదనల్లో రూ.10 వేల కోట్లు మాత్రమే కేటాయించడంపై అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఎంటర్ప్రైజెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.
ఆర్థిక వృద్ధి దిశగా సాగుతున్న ‘సంస్కరణల ఎక్స్ప్రెస్’ సరైన దిశలోనే పయనిస్తున్నదని, అది స్థిరంగా ముందుకు వెళ్తుందని చెప్పారు. సూక్ష్మ పరిశ్రమలకు అత్యవసర పెట్టుబడులు అందుబాటులో ఉంచడానికి ఐదేండ్ల క్రితం నెలకొల్పిన సెల్ఫ్ రిలయెంట్ ఇండియా నిధికి మరో రూ.2,000 కోట్లను జతచేస్తున్నట్టు వెల్లడించారు.
కేంద్ర బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకు సంబంధించి నిర్దిష్టమైన ప్రకటనలేవీ లేవని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఎంటర్ప్రైజెస్ (ఏఐఈ) అసంతృప్తి వ్యక్తంచేసింది. ఎంఎస్ఎంఈలకు ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఎంఎస్ఎంఈలకు సంబంధించి బడ్జెట్లో ఎంతగానో ఆశించామని, కానీ తమను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని ఏఐఈ చైర్మన్ కేఈ రఘునాథన్ పేర్కొన్నారు. వివిధ రంగాలకు పలు రకాలుగా కేటాయింపులు, ప్రోత్సాహకాలను ప్రకటించిన మంత్రి ఎంఎస్ఎంఈలను మాత్రం నిరుత్సాహానికి గురిచేశారని ఆయన విమర్శించారు.