న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం బుధవారం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ క్వాంటమ్ మిషన్కు ఆమోదం తెలిపింది. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి రంగాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో 2023-24 నుంచి 2030-31 వరకు ఈ పథకం కింద రూ.6,035.65 కోట్లను కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మిషన్ కింద రాబోయే ఎనిమిదేండ్లలో 50-1000 ఫిజికల్ క్యూబిట్ల మధ్యంతర స్థాయి క్వాంటమ్ కంప్యూటర్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
ఈ మిషన్ ద్వారా కమ్యూనికేషన్, ఆరోగ్యం, ఎనర్జీ రంగాలతో పాటు ఔషధాలు, డిజైన్, స్పేస్ రంగాలకు అనూహ్యమైన ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. అటామిక్ సిస్టమ్, అటామిక్ క్లాక్లలో కచ్చితమైన కాలసూచిక, కమ్యూనికేషన్, నావిగేషన్కు అవసరమయ్యే మాగ్నోమీటర్లను కూడా ఈ మిషన్ కింద అభివృద్ధి చేస్తారు. ప్రపంచంలోనే క్వాంటమ్ సాంకేతికత కలిగిన ఏడో దేశంగా భారత్ గుర్తింపు పొందింది. మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో సినిమాటోగ్రఫీ బిల్లు, ఆర్థిక బిల్లు (సవరణ)-2023ను ఆమోదించారు. ఇక నుంచి జంతువులకు సంతాన నిరోధ విధానాన్ని అమలు చేసేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకొన్నది.