UNGA | ఐక్యరాజ్య సమితి వేదికగా మరోసారి దాయాది దేశం అసలురంగును భారత్ మరోసారి ప్రపంచానికి చూపించింది. యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత దౌత్యవేత్త భవికా మంగళానందన్ ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదం, డ్రగ్స్ స్మగ్లింగ్కు పాకిస్థాన్ ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంఘటనల్లో పాక్ ప్రమేయం ఉందని.. సరిహద్దు ఉగ్రవాదానికి అనివార్య పరిణామాలను ఆ దేశం భరించాల్సి ఉంటుందని తెలుసుకోవాలన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79వ సాధారణ చర్చలో పాక్ ప్రధాని షాబాజ్ జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.
జమ్ములో ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని.. 2019లో ఆర్టికల్ 370ని అనాలోచితంగా రద్దు చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, దీనిపై భారత దౌత్యవేత్త భవికా మంగళానందన్ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు రవాణా, నేరాలతో అపఖ్యాతిని మూటగట్టుకున్న ఆ దేశం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంపై దాడి చేసేందుకు సాహించిందని విమర్శించారు. పాక్ చాలాకాలంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని పొరుగుదేశాలపై ఆయుధంగా ప్రయోగిస్తున్నది.. పార్లమెంట్, ఆర్థిక రాజధాని ముంబయి, మార్కెట్లు, యాత్రా మార్గాలో దాడి చేసిందని.. ఆ దేశం హింస గురించి మాట్లాడడం కపటత్వమేనన్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు చరిత్ర ఉన్న దేశం ప్రజాస్వామ్యంలో రాజకీయాలపై మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. భారత్లో అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్లో ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తుందని.. ఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు.
సీమాంతర ఉగ్రవాదానికి సంబంధించిన పరిణామాలను ఆ దేశం కచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుందని పాక్ అర్థం చేసుకోవాలన్నారు. 1971లో మారణహోమానికి పాల్పడి.. నేటికి మైనారిటీలను అణచివేస్తున్న దేశం అసహనం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సుదీర్ఘకాలం ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం కల్పించిన దేశం గురించి మనం మాట్లాడుకుంటున్నామని.. ప్రపంచవ్యాప్తంగా అనేక ఉగ్రవాద ఘటనల్లో పాల్గొన్నదని.. అక్కడి విధానాలు ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారాయన్నారు. పాక్ ఎన్ని అబద్ధాలు చెబుతూ నిజాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తుందని తమకు తెలుసునని.. పదేపదే రిపీట్ చేయడం వల్ల ఏమీ మారదని.. ఈ విషయంలో తమ స్టాండ్ స్పష్టంగా ఉందని భవికా స్పష్టం చేశారు.