ద్రవ్యోల్బణంతో ఆర్థిక వ్యవస్థ మందగమనమే కారణం: విశ్లేషకులు
న్యూఢిల్లీ, మే 2: భారతదేశంలో నిరుద్యోగిత రేటు పెరిగింది. ఈ ఏడాది మార్చిలో 7.6%గా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్కు 7.83 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. మొత్తంగా గత నెలలో గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు పెరిగింది. గ్రామాల్లో స్వల్పంగా తగ్గింది. పట్టణాల్లో మార్చితో పోల్చుకుంటే ఏప్రిల్లో నిరుద్యోగిత రేటు 8.28% నుంచి 9.22%కు చేరగా, ఇదే సమయంలో గ్రామాల్లో 7.29%గా ఉన్న నిరుద్యోగ రేటు 7.18%కి తగ్గింది. ఏప్రిల్ నెలకు సంబంధించి సీఎంఐఈ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాలో నిరుద్యోగం తీవ్రస్థాయిలో ఉన్నది. అక్కడ 34.5 శాతం ఉండగా, తరువాతి స్థానాల్లో రాజస్థాన్ (28.8%), బీహార్ (21.1%) గా నమోదైంది. ఇక, హిమాచల్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, అస్సాం వరుసగా 0.2%, 0.6%, 1.2% చొప్పున తక్కువ నిరుద్యోగిత రేటు నమోదు చేసుకున్నాయి.
ఆర్థిక మందగమనమే కారణం
ఆర్థిక మందగమనం వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నట్టు సీఎంఐఈ పేర్కొన్నది. దేశీయంగా డిమాండ్ మందగించడం, పెరుగుతున్న ధరలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదించడం వలన ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో నెలకొన్న ఉద్యోగాల కల్పన లేమి సమస్య కారణంతో పాటు తమకు తగిన ఉద్యోగాలు లభించకపోవడంతో కోట్లాది మంది ఉద్యోగాల వేట ఆపేశారని, కార్మిక శక్తి నుంచి వైదొలుగుతున్నారని సీఎంఐఈ గత నెలలో పేర్కొన్న విషయం తెలిసిందే. మార్చి నెలలో లేబర్ ఫోర్స్ 38 లక్షలు తగ్గిందని పేర్కొన్నది. ఆర్థిక వ్యవస్థలో సరిపడా ఉద్యోగాలను సృష్టించేందుకు వృద్ధి రేటు 6-8% మధ్య ఉంటే సరిపోదని, అంతకుమించి ఉండాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది. మరోవైపు మార్చిలో వినియోగ ధరల సూచీ (సీపీఐ)ద్రవ్యోల్బణం 6.95%తో 17 నెలల గరిష్ఠానికి చేరుకున్నది. ఈ ఏడాది ఆఖరుకు 7.5%కి చేరుకోవచ్చనేది అంచనా. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 4 నెలల గరిష్ఠం 14.55%కి చేరుకున్నది. ‘ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేయాలనేదానికి మోదీ ప్రభుత్వ ఎనిమిదేండ్ల చెత్త పాలన ఓ కేసు స్టడీ వంటిది. దేశంలో ప్రస్తుతం విద్యుత్తు, ఉద్యోగ, రైతు, ద్రవ్యోల్బణ సంక్షోభాలు నెలకొన్నాయి’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.