CJI DY Chandrachud | న్యూఢిల్లీ: న్యాయమూర్తులకు కేవలం చట్టబద్ధమైన అధికారం మాత్రమే సరిపోదని, మానవ జీవితాన్ని, ప్రజా సమస్యలను అర్థం చేసుకోవాలనే ఆకాంక్ష బలంగా ఉండాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీహ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బీ వరాలేలను అభినందించేందుకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు.
సుప్రీంకోర్టులో గరిష్ఠంగా 34 మంది న్యాయమూర్తులు పని చేయవలసి ఉంటుందని, ఈ నలుగురు న్యాయమూర్తులు ఏ విధంగా నిబద్ధతతో కృషి చేశారో వారి జీవితాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. చట్టాల పట్ల పరిజ్ఞానం, వాటిని ఏ సందర్భంలో అమలు చేయాలో తెలిసి ఉండటం ముఖ్యమే అయినప్పటికీ, అంతిమంగా ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడమే మనల్ని ఉత్తమ న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా తీర్చిదిద్దుతుందని చెప్పారు.