న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నది. ఉక్రెయిన్లో పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రవాస భారతీయులు, విద్యార్థులను కేంద్రం తరలిస్తున్నది. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు భారతీయులను తరలించి, అక్కడికి స్వదేశానికి ప్రత్యేక విమానాలను తీసుకువస్తున్నది. ఇందు కోసం ఆపరేషన్ గంగాను సైతం ప్రారంభించగా.. 240 మందితో ఆరో విమానం హంగేరిలోని బుడాపెస్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది.
ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎన్ జైశంకర్ తెలిపారు. కాగా, ఉక్రెయిన్లో రష్యా సైనిక చర్య కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా అక్కడే చిక్కుకుపోయిన వారికి తరలింపు కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నలుగురు కేంద్రమంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపాలని నిర్ణయించారు. ఇందులో హర్దీప్ సింగ్ పూరీ, జ్యోతిరాధిత్య సింధియా, కిరెన్ రిజిజు, వీకే సింగ్ వెళనున్నారు.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ నుంచి వస్తున్న భారతీయుల కోసం ఇప్పటికే పలు మినహాయింపులను ప్రకటించిన కేంద్రం తాజాగా.. ట్రావెల్ అడ్వైజరీని సైతం సడలించింది. భారతీయులు ఎయిర్-సువిధ పోర్టల్లో ప్రయాణానికి ముందు అప్లోడ్ చేయాలని ఆర్టీ పీసీఆర్ టెస్ట్, కొవిడ్ టీకా సర్టిఫికెట్స్ ఇకపై అవసరం లేదని పేర్కొంది. టీకాలు, కొవిడ్ సర్టిఫికెట్ లేని వారు 14 రోజుల పాటు ఆరోగ్యాన్ని వారే స్వయంగా పర్యవేక్షించుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఇవాళ్టికి ఉక్రెయిన్ నుంచి 1,156 మంది భారత్కు చేరుకున్నారు.