Puja Khedkar : తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగం సంపాదించిన వ్యవహారంలో ఆ మధ్య మాజీ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ (Puja Khedkar) పేరు మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆమెపై యూపీఎస్సీ (UPSC) క్రిమినల్ కేసు (Criminal case) నమోదు చేసింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం మే 2న ఢిల్లీ పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని ఖేద్కర్ను ఆదేశించింది.
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఆర్డర్ వేసింది. కేసు తదుపరి విచారణను మే 21 కి వాయిదా వేసింది. అయితే అప్పటివరకు ఖేద్కర్పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోర్టు పేర్కొంది. ఈ కేసులో కచ్చితమైన విచారణ జరగలేదన్న అత్యున్నత న్యాయస్థానం.. విచారణ త్వరగా ముగించాలని పోలీసులను ఆదేశించింది. పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఖేద్కర్ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే కోర్టు ఆమెకు మధ్యంతర రక్షణ కల్పించింది.
పుణెలో ట్రెయినీ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా ఖేద్కర్పై అధికార దుర్వినియోగంతోపాటు, యూపీఎస్సీలో తప్పుడు పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. ఆమెను ముస్సోరిలోని లాల్బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతోపాటు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.
దాంతో పూజా ఖేద్కర్ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఏ పత్రాలను ఫోర్జరీ చేయలేదని తెలిపారు. యూపీఎస్సీకి తనపై అనర్హత వేటువేసే అధికారం లేదని వాదించారు. అయినా ఆమెకు నిరాశే ఎదురైంది. గత ఏడాది ఆగస్టులో ఆమె ముందస్తు బెయిల్కు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. కోర్టు దాన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది.