ఎంఐఎంతో శివసేన పొత్తు పెట్టుకుంటోందన్న వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఖండించారు. పూర్తిగా తప్పుడు ప్రచారం అంటూ మండిపడ్డారు. తమది పూర్తి హిందుత్వ పార్టీ అని, శివసేనను బద్నాం చేయడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఆదివారం పార్టీ నేతలు, కార్యకర్తలు వీడియో కాన్ఫరెన్సింగ్లో మాట్లాడారు.
ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం బీజేపీ బీ టీమ్ అంటూ ఆరోపించారు. ఎంఐఎంతో తాము ఎప్పటికీ పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పారు. ఎందుంటే అది బీజేపీ బీ టీమ్ అని అన్నారు. బీజేపీ హిందుత్వను కేవలం రాజకీయం కోసమే వాడుకుంటుందని మండిపడ్డారు. ఇదంతా బీజేపీ చేస్తోన్న గేమ్ ప్లాన్లో భాగమేనని సీఎం ఆక్షేపించారు.
ఇక ఇదే విషయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా స్పందించారు. అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎంను మహావికాస్ అగాఢీలోకి తీసుకోమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, సంకీర్ణ ప్రభుత్వంలోకి తీసుకోమని తేల్చి చెప్పారు. అలాంటి అవకాశాలేవీ లేవన్నారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడమంటే అదో రోగం లాంటిదని, ఔరంగజేబుల ముందు మోకరిల్లిన వారితో పొత్తు ఎలా పెట్టుకుంటామని సూటిగా ప్రశ్నించారు. అసలు ఇలాంటి ప్రతిపాదన తమ ఆలోచనల్లోకి కూడా రాదని తేల్చి చెప్పారు. శివసేన ఛత్రపతి శివాజీ స్ఫూర్తితోనే రాజకీయాలు చేస్తుందని రౌత్ ప్రకటించారు.