మోదీ-షా ద్వయం కూటనీతికి మరో రాష్ట్ర ప్రభుత్వం బలైపోయింది. ‘మహా’ రాజకీయాల్లో గత తొమ్మిది రోజులుగా సంక్షోభాన్ని సృష్టించిన బీజేపీ.. చివరకు ఉద్ధవ్ ఠాక్రేను సీఎం పీఠం నుంచి దించేయడంలో విజయం సాధించింది. ‘ఉంటే మాతోనే.. లేకుంటే అంతమే’ అని శివసేనపై బెదిరింపులకు పాల్పడిన మోదీ పరివారం.. ఎట్టకేలకు పంతాన్ని నెగ్గించుకున్నది. మహావికాస్ అఘాడీ సర్కారును కూల్చివేసింది. మహారాష్ట్ర సీఎం పదవికి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే బుధవారం రాజీనామా చేశారు. బలపరీక్షకు సిద్ధమవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన కొన్ని నిమిషాల్లోనే తన పదవికి, శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూలదోసి పవర్ పాలిటిక్స్తో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకున్న రాష్ర్టాల సంఖ్య తాజాగా ఎనిమిదికి చేరింది. మోదీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలోనే కమలదళం ఈ ఫీట్ సాధించింది.
ముంబై, జూన్ 29: గత తొమ్మిది రోజులుగా కీలక మలుపులు తీసుకున్న మహా సంక్షోభానికి ఉద్ధవ్ రాజీనామాతో తెరపడింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే బుధవారం రాత్రి ప్రకటించారు. విశ్వాస పరీక్షకు గవర్నర్ ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. బల పరీక్షపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. గురువారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. దీంతో విశ్వాస పరీక్షకు ముందే తాను సీఎం పోస్టుకు రాజీనామా చేస్తున్నట్టు ఉద్ధవ్ ప్రకటించారు. బయటివారు కాకుండా సొంతవాళ్లే తనకు నమ్మక ద్రోహం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నంబర్ గేమ్ ఆడటం తనకు ఇష్టంలేదన్నారు.
రోజంతా హైడ్రామా..
శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబావుటాతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (ఎంపీఏ) ప్రభుత్వం మైనారిటీలో పడిందని, బలపరీక్షకు ఆదేశించాలని విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ లేఖ రాయడంతో గురువారం ఉదయం 11 గంటలకు బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ఉద్ధవ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. సాయంత్రం 5 గంటల్లోగా ఎట్టిపరిస్థితుల్లో బలపరీక్షను ముగించాలని సూచించారు. దీన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విశ్వాస పరీక్ష ఆదేశాలపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం గురువారం బలపరీక్ష నిర్వహించాల్సిందిగా తీర్పునిచ్చింది. జైలులో ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్ను విశ్వాస పరీక్షలో పాల్గొనడానికి అనుమతించింది.
నాకే సిగ్గుచేటు
కోర్టు తీర్పు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే తన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఉద్ధవ్ ప్రకటించారు. ఈ మేరకు ఫేస్బుక్ లైవ్లో ప్రసంగించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్టు పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపటంలో తనకు సహకరించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వానికి కొందరి దిష్టి తగిలిందని.. అది ఎవరిదో అందరికీ తెలుసని పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. సొంతపార్టీ వాళ్లే నమ్మకద్రోహం చేయడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
‘సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా.. శివసైనికుల రక్తం చిందించడం నాకు ఇష్టం లేదు. నేను ఊహించని రీతిలో అధికారాన్ని చేపట్టాను. అదే మార్గాన వెళ్తున్నా. ఎప్పుడూ ఇక్కడే ఉంటా. శివసేన భవన్లోనే కూర్చుంటా. నా ప్రజలతో సమావేశమవుతా. అలాంటి వ్యక్తుల పట్ల (రెబల్స్) విశ్వాసం ఉంచడమే నేను చేసిన అతిపెద్ద తప్పు’ అని తన ప్రసంగంలో పేర్కొన్నారు. బాలాసాహెబ్ తనయుడిని సీఎం పోస్టులో నుంచి కిందకు దించి సంతోషపడుతున్న రెబల్స్ని సంబురాలు చేసుకోనివ్వండంటూ ఉద్వేగానికి లోనయ్యారు. నంబర్ గేమ్ ఆడటం తనకు ఇష్టం లేదని, సొంత పార్టీ వాళ్లే తనకు వ్యతిరేకంగా నిలబడితే భరించలేనన్నారు. అది తనకే సిగ్గుచేటని పేర్కొన్నారు. అనంతరం రాజ్భవన్కు వెళ్లి రాజీనామాను గవర్నర్కు సమర్పించారు.
మృదు స్వభావి..
బాల్ ఠాక్రే చిన్న కొడుకు ఉద్ధవ్ ఠాక్రే. 1990ల నుంచి తండ్రితో పాటు శివసేన రాజకీయ వ్యవహారాల్లో ఉన్నారు. 2001లో పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. మృదు స్వభావి అయిన ఉద్ధవ్ను ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా నియమించడంపై రాజ్ ఠాక్రే అలిగారు. పార్టీ నుంచి వెళ్లిపోయారు. 2005లో మాజీ సీఎం, పార్టీ సీనియర్ నేత నారాయణ్ రాణే పార్టీకి రాజీనామా చేశారు. 2002, 2007, 2012, 2017లో బృహణ్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేననే గెలుస్తూ వచ్చింది. 2012లో బాల్ ఠాక్రే చనిపోయినప్పుడు శివసేన కథ ముగుస్తుందని అంతా భావించారు. కానీ ఉద్ధవ్ శివసేనను నడిపించారు. పరిణతి చెందిన రాజకీయ పార్టీగా మార్చారు. ఠాక్రే కుటుంబం నుంచి ప్రభుత్వ పదవి చేపట్టిన తొలి వ్యక్తి కూడా ఉద్ధవే కావడం విశేషం. కరోనా కట్టడిలో ఉద్ధవ్ సర్కారు పనితీరుపై ప్రశంసలు లభించాయి.
1న ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్న బీజేపీ?
సీఎం పదవికి ఉద్ధవ్ రాజీనామా చేయడంతో ముంబైలోని తాజ్ ప్రెసిడెంట్ హోటల్లో బీజేపీ నేతలు సంబురాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకొని.. మాజీ సీఎం ఫడ్నవీస్కు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఫడ్నవీస్ గవర్నర్ను కోరనున్నట్టు సమాచారం. జూలై 1న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. షిండే వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుందని, షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నట్టు ప్రచారం సాగుతున్నది. మరోవైపు, విశ్వాస పరీక్షకు గవర్నర్ ఆదేశించడంతో అస్సాంలోని గువాహటిలో స్టార్ హోటల్లో గత ఎనిమిది రోజులుగా బస చేస్తున్న రెబల్ ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి గోవాకు చేరుకున్నారు. గురువారం ఉదయం వాళ్లంతా ముంబై చేరుకోనున్నట్టు సమాచారం. ‘ఏం చేయాలన్నదానిపై అందరం సమావేశమై నిర్ణయిస్తామ’ని రెబెల్ ఎమ్మెల్యే భరత గోగవాలే చెప్పారు. అయితే, ఉద్ధవ్ రాజీనామాపై తామేమీ సంతోషంగా లేమని తెలిపారు.
రెండున్నరేండ్లూ సాఫీగా సాగలేదు
2019 అక్టోబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమి విజయం సాధించింది. అయితే సీఎం పదవి విషయంలో భేదాభిప్రాయాలు తలెత్తడంతో కూటమి నుంచి బయటకు వచ్చిన సేన.. ఎన్సీపీ, కాంగ్రెస్తో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా ఉద్ధవ్ పగ్గాలు చేపట్టారు. అయితే, కాంగ్రెస్, శివసేన మధ్య కొన్ని విషయాల్లో పొసగలేదు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ పదేపదే ప్రయత్నించింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్లోని కీలక నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీతో దాడులు చేయించింది. చివరకు ఏక్నాథ్ షిండేను రెచ్చగొట్టి ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసేలా చేసింది. సంకీర్ణ సర్కారు కుప్పకూల్చింది.
శంభాజీనగర్గా ఔరంగాబాద్
ఉద్ధవ్ సర్కారు చివరి క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఔరంగాబాద్ పేరును శంభాజీనగర్గా, ఉస్మానాబాద్ పేరును ధారాశివ్గా మార్చడానికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించింది. త్వరలో అందుబాటులోకి రానున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి దివంగత నేత డీబీ పాటిల్ పేరును పెట్టడానికి ఆమోదముద్ర వేసింది.