హింగోలి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను భవిష్యత్లో ప్రధానమంత్రి పదవికి పోటీదారుగా ఎదగకుండా చేసేందుకే కేంద్ర హోంమత్రి అమిత్ షా ‘అపరేషన్ టైగర్’కు తెరలేపారని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. మహారాష్ట్రలోని హింగోలీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఇది ‘ఆపరేషన్ టైగర్’ కాదని, ‘ఆపరేషన్ దేవేంద్ర’ అని వ్యాఖ్యానించారు. తిరుగుబాటు చేసిన శివసేన ఎంపీలు నేరుగా బీజేపీలో చేరకుండా, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో ఎందుకు చేరారని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్లో అవసరమైతే ఈ తిరుగుబాటు ఎంపీలు అమిత్షాకు ప్రధానమంత్రి పదవి కోసం ఓటు వేస్తారు’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలు, పరీక్షా పత్రాల లీకేజీల వంటి ప్రజా సమస్యలను పక్కనపెట్టి, ప్రభుత్వం రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ఆయన దుయ్యబట్టారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు శివసేన వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ ఠాక్రేకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఎంపీలు పార్టీని వీడినా కార్యకర్తలు తమ వెంటే ఉన్నారన్నారు. కాగా 2024 లోక్సభ ఎన్నికల్లో శివసేన(యూబీటీ) తొమ్మిది స్థానాలను గెలుచుకుంది. వారిలో ఆరుగురు తాజాగా షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దీంతో లోక్సభలో షిండే వర్గం బలం ఏడు నుంచి 13కు పెరిగింది.