Civils Rank Dispute | సివిల్స్ పరీక్షల్లో ర్యాంక్ సాధిస్తే.. కలెక్టర్లుగా, ఎస్పీలుగా.. ఫారెస్ట్ అధికారులుగా.. రెవెన్యూ అధికారులుగా.. విదేశీ రాయబారులుగా దేశానికి సేవచేయొచ్చు. అంతటి ప్రతిష్టాత్మక పరీక్షలు ఇవి. రెండ్రోజుల క్రితం 2022- సివిల్స్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. కానీ.. మధ్యప్రదేశ్లోని ఇద్దరు యువతుల ఇంటిపేరు, రోల్ నంబర్, ర్యాంక్ ఒకటే కావడం గందరగోళానికి దారి తీసింది. ఇందులో నిజంగా సివిల్స్కు హాజరైన అభ్యర్థి ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది.
దేవాస్ జిల్లా వాసి ఆయేషా ఫాతిమా (23), అలిరాజ్ పూర్ జిల్లాకు చెందిన ఆయేషా మక్రానీ (26) తాము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్లో ఒకే ర్యాంక్ `184` సాధించామని చెప్పారు. వారిద్దరూ పరస్పరం 200 కి.మీ. దూరంలో నివసిస్తుంటారు. ఇద్దరూ ఒకే నంబర్ మీద అడ్మిట్ కార్డులు ప్రదర్శించారు. తమకు తగిన న్యాయం చేయాలని కోరుతూ స్థానిక పోలీసులకు, యూపీఎస్సీకి ఫిర్యాదు చేశారు. వారిద్దరూ ఫ్రాడ్ జరిగిందని ఆరోపిస్తూ.. క్లారిఫికేషన్ ఇవ్వాలని యూపీఎస్సీని కోరారు.
‘నేను రెండేండ్లుగా కష్టపడి చదివాను. ఎవరో ఒక వ్యక్తి నా హక్కు హరిస్తానంటే వదిలే ప్రసక్తి లేదు. యూపీఎస్సీ, కేంద్ర ప్రభుత్వం నాకు న్యాయం చేయాలి` అని ఆయేషా మాక్రాని కోరారు.
ఆయేషా ఫాతిమా కూడా దాదాపు ఇవే మాటలు చెప్పారు. `ఎవరో ఒక అమ్మాయి రోల్ నంబర్ తనది చెప్పడం దిగ్భ్రాంతి కలిగించింది. ఇందులో ఫ్రాడ్ ఏమీ ఉండకపోవచ్చు. దీనిపై అన్ని అంశాలు పరిశీలిస్తా’ అని వ్యాఖ్యానించారు ఫాతిమా.
కానీ, ఆయేషా మాక్రానీ, ఆయేషా ఫాతిమా అడ్మిట్ కార్డుల్లో తేడాలు ఉన్నాయి. సివిల్స్ పరీక్షలో ముఖ్యమైన పర్సనాలిటీ టెస్ట్.. వీరికి నిర్వహించిన పర్సనాలిటీ టెస్ట్ తేదీ ఒకటే.. అదీ ఏప్రిల్ 25. టెస్ట్ తేదీ ఒకటే.. అయినా మాక్రానీ అడ్మిట్ కార్డులో గురువారం అని ఉంది. కానీ, ఫాతిమా అడ్మిట్ కార్డులో మంగళవారం అని ఉంది. వాస్తవంగా 2023 ఏప్రిల్ 25న మంగళవారం.
ఆయేషా ఫాతిమా అడ్మిట్ కార్డు మీద క్యూఆర్ కోడ్తోపాటు యూపీఎస్సీ వాటర్ మార్క్ ఉంది. మాక్రానీ అడ్మిట్ కార్డుపై ఏ ‘క్యూఆర్ కోడ్’ లేకుండా ప్లెయిన్ పేపర్ ప్రింటవుట్గా కనిపిస్తున్నది. దీనిపై యూపీఎస్సీ వర్గాలు స్పందిస్తూ.. అవసరమైన కరెక్షన్లు చేశామని.. ఆయేషా ఫాతిమా సరైన అభ్యర్థి అని చెప్పారు. ఈ తరహా పొరపాటు ఎలా జరిగిందో దర్యాప్తు చేస్తామని ఆ వర్గాల కథనం.