శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. షోపియాన్లోని ద్రాగడ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ముష్కరులు గాలింపు బృందాలపై కాల్పులు ప్రారంభించాయి. దీంతో ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
మృతి చెందినవారిలో ఒకరు ఆదిల్ అహ్ వానీగా గుర్తిచామన్నారు. అతడు గతేడాది జూలై నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని చెప్పారు. పుల్వామాలో పొట్టచేతపట్టుకుని వచ్చిన కూలీల హత్యకేసులో అతడు ప్రధాన నిందితుడని తెలిపారు. మరో టెర్రరిస్టుకు సంబంధించిన వివరాలు తెలియరాలేదని చెప్పారు. గత రెండు వారాల్లో 15 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టామన్నారు.