శ్రీనగర్, జూలై 3: జమ్ముకశ్మీర్లో రియాసీ జిల్లాలో పట్టుబడిన ఇద్దరు లష్కరే తాయిబా ఉగ్రవాదుల్లో ఒకరు బీజేపీ క్రియాశీల సభ్యుడు ఉండటం సంచలనం రేపుతున్నది. ఆశ్రయం పేరుతో తుక్సన్లో గ్రామంలోకి వచ్చిన ఇద్దరు టెర్రరిస్టులను గ్రామస్తులు ఎంతో ధైర్యసాహసాలతో పట్టుకొని నిర్బంధించారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన ఉగ్రవాదులను మోస్టు వాంటెడ్ తాలిబ్ హుస్సేన్ షా, ఫైజల్ అహ్మద్ దార్గా పోలీసులు గుర్తించారు. వీరిలో హుస్సేన్ షా బీజేపీ క్రియాశీల సభ్యుడిగా ఉన్నాడు.
రాజౌరీ జిల్లాకు చెందిన హుస్సేన్ షా జమ్ము రీజియన్ బీజేపీ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా ఇన్చార్జి. జమ్ములో హుస్సేన్ షాను పార్టీ మైనార్టీ మోర్చా కొత్త ఐటీ అండ్ సోషల్ మీడియా ఇన్చార్జిగా నియమిస్తూ బీజేపీ మే 9న ఆర్డర్ కూడా విడుదల చేసింది. అదేవిధంగా హుస్సేన్ షాకు పలువురు బీజేపీ సీనియర్ నేతలతో కూడా సంబంధాలు ఉన్నట్టు తెలుస్తున్నది. జమ్ముకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనాతో పాటు తదితరులతో దిగిన ఫొటోలు చాలా ఉండటం ప్రాధాన్యత సంతరించుకున్నది. అయితే హుస్సేన్ విషయంపై బీజేపీ భిన్నంగా స్పందించింది. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ పరిశీలన లేకుండా పార్టీలో చేర్చుకునే ఆన్లైన్ సభ్యత్వ నమోదు వ్యవస్థ వల్ల ఈ తప్పిదం జరిగిందని, ఇదొక కుట్ర కోణం అని చెప్పుకొస్తున్నది.
గ్రామస్తుల ధైర్యానికి రివార్డు
ఎంతో తెగువతో ఉగ్రవాదులను నిర్బంధించిన తుక్సన్ గ్రామస్తులను జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్ము అడిషనల్ డీజీపీ అభినందించారు. గ్రామస్తులకు యూటీ ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు, పోలీసు శాఖ తరపున రూ.2 లక్షల రివార్డు ప్రకటించారు. గ్రామస్తుల ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నానని ఎల్జీ సిన్హా ట్విట్టర్లో పేర్కొన్నారు. సామాన్య పౌరులకు ఉన్న ఇటువంటి దృఢ సంకల్పం చూస్తుంటే ఉగ్రవాద అంతం ఎంతో దూరంలో లేదని అనిపిస్తున్నదని అన్నారు. రాజౌరీ జిల్లాలో జరిగిన రెండు పేలుళ్ల ఘటనలో హుస్సేన్ షా పాత్ర ఉన్నదని పోలీసులు పేర్కొన్నారు.