కోల్కతా : పశ్చిమ బెంగాల్కు చెందిన పోలీస్ స్పెషల్ టాస్క్ఫోర్స్ ఉత్తర 24 పరగణాస్ జిల్లాలో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు వ్యక్తులు అల్ఖైదాకు పని చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తర 24 పరగణాస్లోని షాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖరీబారి వద్ద బుధవారం రాత్రి ఎస్టీఎఫ్ అధికారులు దాడులు జరిపి.. ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఒకరు దక్షిణ్ దినాజ్పూర్ జిల్లాలోని గంగారాంపూర్ నివాసి అనీ, మరొకరు హుగ్లీ జిల్లాలోని ఆరంబాగ్కు చెందినవారన్నారు.
వారి వద్ద నుంచి అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు. అల్ఖైదాతో సంబంధం ఉన్న ఇద్దరినీ అరెస్టు చేశారని, భారత్పై యుద్ధం చేస్తున్నట్టుగా సూచించే అత్యంత రాడికలైజ్డ్ ఆలోచనలతో కూడిన పత్రాలు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. వారిపై నిర్ధిష్టంగా కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరిని విచారించిన అనంతరం కనీసం 17 మంది అల్ఖైదా సభ్యులు యాక్టివ్గా ఉన్నట్లు తేలిందని అధికారి పేర్కొన్నారు. ఇద్దరిని ఇవాళ స్థానిక కోర్టులో హాజరుపరుచనున్నట్లు తెలిపారు.