న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని భారత్-చైనా సరిహద్దులో విధుల్లో ఉన్న ఇద్దరు భారత సైనికులు అదృశ్యమయ్యారు. గత 14 రోజులుగా వీరు కనిపించడం లేదు. అరుణాచల్ ప్రదేశ్లోని ఇండో-చైనా సరిహద్దులోని థక్లా పోస్ట్ వద్ద ఆర్మీ జవాన్లను మోహరించారు. ప్రకాష్ సింగ్ రాణా, హరేంద్ర నేగి అనే ఇద్దరు సైనికులు మే 28 నుంచి అదృశ్యమయ్యారు. చైనా ఆర్మీ కిడ్నాప్ చేసిందా లేక దారి తప్పి సరిహద్దులు దాటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ విషయం తెలియడంతో ఆ సైనికుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
మరోవైపు సహస్పూర్ బీజేపీ ఎమ్మెల్యే సహదేవ్ సింగ్ పుండిర్, సైనిక్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రకాష్ సింగ్ రాణా కుటుంబాన్ని శుక్రవారం కలిశారు. రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. కనిపించకుండా పోయిన ఇద్దరు భారత సైనికుల ఆచూకీని తెలుసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చినట్లు వెల్లడించారు.