పాట్నా: ఒక కోర్టు జడ్జీపై ఇద్దరు పోలీస్ అధికారులు దాడి చేశారు. విచారణ జరుగుతుండగా కోర్టు హాల్లోకి ప్రవేశించి న్యాయమూర్తిని కొట్టారు. ఆయనపైకి తుపాకీలను కూడా ఎక్కుపెట్టారు. ఊహించని ఈ ఘటనకు ఆ న్యాయమూర్తి షాక్ అయ్యారు. బీహార్ రాష్ట్రం మధుబని జిల్లాలోని ఝంఝర్పూర్ కోర్టులో గురువారం ఈ ఘటన జరిగింది. ఘోఘర్దిహ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ గోపాల్ ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు కుమార్ గురువారం ఉదయం ఝంఝర్పూర్లోని జిల్లా అదనపు, సెషన్స్ కోర్టుకు వచ్చారు.
కాగా, న్యాయమూర్తి అవినాష్ కుమార్ తీర్పుల వల్ల వారికి చెడ్డ పేరు వచ్చింది. ఆయన తన తీర్పులో చాలా సందర్భాలలో పోలీసు సూపరింటెండెంట్పై కూడా వ్యాఖ్యలు చేశారు. ఒక కేసుకు సంబంధించి వీరిద్దరు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గురువారం కోర్టుకు వచ్చారు. అయితే మరో కేసు విచారణ జరుగుతుండగా అకస్మాత్తుగా కోర్టు హాలులోకి వెళ్లి న్యాయమూర్తిని కొట్టారు. దీంతో ఆయన షాక్ అయ్యారు.
వెంటనే స్పందించిన కోర్టు సిబ్బంది, న్యాయవాదులు జడ్జీని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీస్ అధికారులైన గోపాల్ ప్రసాద్, అభిమన్యు కుమార్ కూడా గాయపడ్డారు. అనంతరం వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యాయమూర్తిపై పోలీసుల దాడిని ఝంఝర్పూర్ బార్ అసోసియేషన్ ఖండించింది. ‘ఇంతకు ముందు నేరస్తుల నుంచి రక్షణ కోరేవాళ్లం. ఇప్పుడు పోలీసుల నుంచి కూడా రక్షణ కోరాల్సి వస్తున్నది’ అని ఒక న్యాయవాది అన్నారు. ఇద్దరు నిందితులతో పాటు ఎస్పీపైనా కేసు నమోదు చేయాలని, త్వరితగతిన విచారణ జరిపి వారికి శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరవధిక సమ్మెకు దిగి కోర్టు కార్యకలాపాలను నిలిపివేస్తామని హెచ్చరించారు.