న్యూఢిల్లీ : యువత, మధ్య వయస్కులు, వృద్ధులు అన్న తేడా లేకుండా భారతీయులంతా మానసిక ఒత్తిడితో చిత్తవుతున్నారు. దేశ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ‘న్యూ సారిడాన్ హెడేక్ సర్వే’లో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. మంగళవారం విడుదలైన ఈ రిపోర్టులో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 93 శాతం మంది కరోనా తర్వాత తాము తరుచూ తలనొప్పితో బాధపడుతున్నట్టు తెలిపారు.
మానసిక ఒత్తిడికి ఆర్థిక కష్టాలు, పని ఒత్తిడే కారణమని అత్యధికమంది పేర్కొన్నారు. ఒత్తిడి కారణాల్లో అనారోగ్యం, కుటుంబ కలహాలు రెండోస్థానంలో ఉన్నాయి. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ప్రజలు అత్యధికంగా ఉన్న టైర్ 1 పట్టణప్రాంతాల్లో ముంబై మొదటి స్థానంలో ఉన్నది. టైర్ 2 నగరాల్లో అహ్మదాబాద్, భువనేశ్వర్ మొదటి స్థానంలో ఉన్నాయి. 26-35 ఏండ్ల మధ్య వయస్కుల్లోనే అత్యధికంగా (87 శాతం) ఈ ఒత్తిడి సమస్య ఉన్నది. 35-46 మధ్య వయస్కుల్లో 86 శాతం మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.